'టీడీపీ వల్లే మోడీ ప్రధాని, వైయస్ చీల్చమన్నారు.. మోడీ వస్తారని ఊహించలేదు'
అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వల్లే నరేంద్ర మోడీ, బీజేపీ ఈ స్థాయికి వచ్చారని, పీఎంవోలో వైసీపీ విజయసాయి రెడ్డి ఫోటోలను మీడియా తీస్తుంటే పీఎంవో సిబ్బంది అరిచారని వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిమిషానికో మాట మాట్లాడుతున్నారని, ఆయన తెలిసే అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విభనజలో హేతుబద్దత లేదని తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. జయలలిత ఉన్నన్ని రోజులు తమిళనాడుపై బీజేపీ దృష్టి సారించలేదన్నారు.
విజయసాయి ఫోటోలు తీస్తుంటే అరిచారు
విజయ సాయి రెడ్డి పీఎంవోలో ఉన్నప్పుడు ఫోటోలు తీస్తే మీడియా ప్రతినిధులపై పీఎంవో సిబ్బంది అరిచారని తెలిసిందని చంద్రబాబు అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే దొంగలకు వాళ్లే రక్షణగా ఉన్నారనిపిస్తోందన్నారు.
పవన్ కళ్యాణ్ తెలిసే మాట్లాడుతున్నారు
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై నిమిషానికి ఓ మాట మాట్లాడుతున్నారని, ఆయన తెలియక మాట్లాడటం లేదని, తెలిసే మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. హోదా రాకపోయినా నిధులిస్తే చాలని పవన్ అన్నారని, అసలు నిధులు ఎన్ని వస్తాయో కూడా పవన్కు తెలియదన్నారు.
మోడీకి నేనంటే కోపం ఎందుకు
మనం అవిశ్వాస తీర్మానం అనగానే అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయని, హోదాపై కాంగ్రెస్ కూడా పట్టుబడుతోందని చంద్రబాబు అన్నారు. హోదాపై కనీసం కేంద్రం పిలిచి మాట్లాడటం లేదన్నారు. వాళ్లు సాయం చేయకపోగా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మోడీకి తాను అంటే ఎందుకు కోపమన్నారు. గోద్రా అల్లర్ల ఘటన నేపథ్యంలో తాను వ్యతిరేకించిన విషయాన్ని మోడీ గుర్తు పెట్టుకుంటారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీతో ఉంటే పూర్తిగా మునిగిపోతామని, అందుకే అశోక్, సుజనలతో కేంద్రమంత్రులుగా రాజీనామా చేయించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు.
మోడీ ఎదగడానికి టీడీపీనే కారణం
నరేంద్ర మోడీ ఈ స్థాయికి రావడానికి టీడీపీనే కారణమని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఎన్టీఆర్ ఏకం చేశారని గుర్తు చేశారు. ఫలితంగానే ఇవాళ కాంగ్రెస్కు ధీటుగా మోడీ ఎదిగారన్నారు. టీడీపీ వాజపేయికి మద్దతిచ్చి, బీజేపీ ఎదుగుదలకు సహకరించిందన్నారు. రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలు, హోదాపై సమీక్షించాలని కోరామని, కానీ అలా చేసే పరిస్థితిలో కూడా కేంద్రం లేదన్నారు.
వైయస్ చీల్చమన్నారు, మోడీ వస్తారని ఊహించలేదు
రాష్ట్రాన్ని చీల్చితేనే మీరు బలపడతారని నాడు వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్రానికి చెప్పారని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీలాంటి వ్యక్తి కేంద్రంలోకి వస్తారని వారు అప్పుడు ఊహించలేదన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టి వైసీపీ హోదా విషయంలో భయపడుతోందన్నారు.
జయలలిత ఉన్నంత కాలం వెళ్లలేదు
దివంగత జయలలిత ఉన్నంత కాలం తమిళనాడుకు బీజేపీ పోలేదని చంద్రబాబు అన్నారు. ఆమె చనిపోగానే అన్ని ఆపరేషన్లు ప్రారంభించారన్నారు. కానీ ఏపీలో ఏ ఆపరేషన్ పని చేయదని చెప్పారు. అన్నాడీఎంకేను అడ్డు పెట్టుకొని సభ జరగకుండా డ్రామాలు ఆడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై దాడి
ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం దాడి అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ సమయంలోను కేంద్రం ఇలాగే ఇబ్బంది పెట్టిందన్నారు. ఇవ్వాల్సింది ఇవ్వమని చెబితే బీజేపీ వాళ్లకు కోపం వస్తోందన్నారు. ఇందిరా గాంధీ లాంటి వారు కూడా టీడీపీ పైకి వచ్చారని చెప్పారు. కేంద్రం ఏం చేసినా వైసీపీకి బాగానే కనిపిస్తోందన్నారు. బీజేపీతో తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని చంద్రబాబు చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామన్నారు. మనం సమర్థవంతంగా పోరాడకుంటే అసత్యాలే నిజాలు అనుకుంటారని తెలిపారు.