ఏపీకి శుభవార్త, ప్యాకేజీకి మోడీ కేబినెట్ ఓకే: పవన్-జగన్లకు చెక్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు శుభవార్త. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరానికి వంద శాతం నిధులివ్వాలని ప్రతిపాదన చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా... తర్వాత ప్యాకేజీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో హోదా ఇస్తామని చెప్పడం వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపి కూటమికి మద్దతు పలికారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల దాకా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత దానిపై మాట దాటేశారు. అనంతరం, కొద్ది రోజులకు ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని, ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.
ప్యాకేజీపై పవన్, జగన్ల నిలదీత
ప్రత్యేక హోదాను కాదని, ప్యాకేజీని ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్, కాంగ్రెస్ తదితర పార్టీలు మండిపడ్డాయి. హోదాతోనే లాభమని, ప్యాకేజీతో ఎలాంటి లబ్ధి చేకూరదని విమర్శించారు. మనకు వచ్చే నిధులనే ప్యాకేజీలో చూపిస్తారని ఆరోపించారు.
ప్యాకేజీకి చట్టబద్ధత కోసం..
ప్రత్యేక హోదాపై బీజేపీ తేల్చేసిన అనంతరం.. జనసేన, కాంగ్రెస్, వైసిపిలు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కోసం డిమాండ్ చేశారు. హోదాను పక్కన పెట్టారని, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకుండా ఉపయోగం లేదన్నారు.
ప్రత్యేక హోదాపై నిలదీసిన పవన్ కళ్యాణ్, జగన్లు కూడా ప్యాకేజీకి చట్టబద్దత అంశాన్ని పదేపదే ప్రశ్నించాయి. మరోవైపు, చంద్రబాబు కూడా హోదా ఎలాగు ఇవ్వడం లేదని, కాబట్టి ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
హోదాతో ఇప్పటికే ఇబ్బంది.. విజ్ఞప్తి
అప్పటికే హోదా పేరుతో విపక్షాలు ఇరుకున పెడుతున్నాయి. ప్యాకేజీకి కూడా చట్టబద్ధత ఇవ్వకపోవడం వారికి మరో అస్త్రంగా మారింది. దీంతో చంద్రబాబుతో పాటు, ఏపీ బీజేపీ నేతలు కూడా చట్టబద్దత కోసం అడిగారు. ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
ఇక వారికి చెక్!
ఇక, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం ద్వారా దాని గురించి అడిగిన విపక్షాలకు కేంద్రం చెక్ చెబుతున్నట్లుగా భావించవచ్చు. పవన్, జగన్, కాంగ్రెస్లకు ప్యాకేజీపై చట్టబద్ధత గురించి అడిగే అవకాశాన్ని ఇవ్వకుండా.. హోదాతో వచ్చిన నష్టాన్ని కొంతలో కొంతనైనా తగ్గించుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.