అమరావతిలో ప్రధాని 75నిమిషాలే: అత్యాధునిక ఎంఐ8 హెలికాప్టర్, ప్రత్యేకతలివీ
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం అత్యాధునిక ఎంఐ 8 హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. వాయుసేన నుంచి మూడు హెలికాప్టర్లు విజయవాడకు ఒకరోజు ముందుగానే... బుధవారమే గన్నవరం చేరుకోనున్నాయని తెలుస్తోంది.
ప్రధాని గురువారం దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ముఖ్యమంత్రి, చంద్రబాబు సహా ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం 12.10 ప్రాంతంలో అక్కడే సిద్ధంగా ఉండే ఎంఐ-8 హెలికాప్టర్లో ఉద్దండరాయునిపాలెం బయల్దేరుతారు.
అదే తరహాలో ఉండే మరో రెండు హెలికాప్టర్లు కూడా దాని వెంట బయలుదేరుతాయి. ప్రధాని ఏ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారనేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారులకు తప్ప ఇతరులకు తెలియకుండా ఉంటుంది.
బుధవారమే మూడు ఎంఐ 8 హెలికాప్టర్లు విజయవాడకు చేరుకుని రూట్ మ్యాప్లను పరిశీలించనున్నాయి. అత్యాధునిక భద్రతా ఉపకరణాలు వీటి సొంతం. అవసరమైతే హెలికాప్టర్ నుంచే శత్రువులపై దాడి చేయవచ్చు. తనపైకి దూసుకువచ్చే క్షిపణులను పసిగట్టే రాడార్ వ్యవస్థ ఇందులో ఉంటుంది.

ప్రధాని నరేంద్ర మోడీ, ముగ్గురు అతిథులు కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. మరోవైపు, ప్రధాని మోదీ ఆహారపు ఏర్పాట్లన్నీ ఆయన కార్యాలయ సిబ్బందే చేసుకుంటున్నారు. ఆయన గురువారం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అటు నుంచి హెలికాప్టర్లో శంకుస్థాపన స్థలికి చేరుకుంటారు.
అనంతరం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి తిరుపతికి తన ప్రత్యేక విమానంలో వెళ్తారు. ఆ సమయంలో మోడీ తీసుకునే ఘన, ద్రవ ఆహార ఏర్పాట్లను ప్రధాని కార్యాలయ సిబ్బంది చూసుకోనున్నారని తెలుస్తోంది.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి గురువారం పారంభించనున్న సందర్భంగా సోమవారం ఎస్పీజీ అధికారులు విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాగా, ప్రధాని మోడీ శంకుస్థాపన కార్యక్రమం వద్ద కేవలం 75 నిమిషాలు (గంటంపావు) మాత్రమే ఉండనున్నారు.












Click it and Unblock the Notifications