ఏపీలో మోడీ టూర్: వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న బీజేపీ; టార్గెట్ ఫిక్స్!!
2024 ఎన్నికల్లో టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోందా? దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న బిజెపి ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతుందా? జాతీయ నేతల వరుస పర్యటనలు, వచ్చే నెలలో ఏపీలో మోడీ పర్యటన ఎన్నికల రాజకీయాలను కళ్ళకు కడుతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించి మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుంది. ప్రధానంగా అందులో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తుంది. అందులో భాగంగా అగ్రనేతలను ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా రంగంలోకి దింపుతుంది. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీకి పట్టు కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు సాగిస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో పట్టు కోసం బీజేపీ రంగంలోకి
నిన్న మొన్నటి వరకూ దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే అక్కడ మాత్రమే కనిపించిన మోడీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాలలోనూ ముందస్తు పర్యటన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మోడీ దృష్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పై పడింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన బిజెపి ఈసారి ఎలాగైనా తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ సారధ్యంలో పార్టీ బలోపేతం అయిందని భావిస్తున్న బిజెపి అధినాయకత్వం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా బిజెపి ఉంది అన్న భావనను ప్రజల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది.

మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికలలో పొత్తులతో ముందుకు వెళితే పట్టు సాధించవచ్చు అన్న భావన బిజెపి అగ్రనేతలలో ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పలుమార్లు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసిన తెలంగాణ, ఏపీలో పర్యటించాలని నిర్ణయించారు.

ఏపీలో మోడీ పర్యటన .. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి
ఇదిలా ఉంటే మోడీ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఏంటి అన్నది ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. కానీ మోడీ ఏపీలో పర్యటించడం పక్కా అని తెలుస్తుంది. పూర్తిగా రాజకీయ కారణాలతోనే ప్రధాన నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నట్టు సమాచారం. మరి ఏపీ పర్యటనలో ప్రధాని మోడీ జగన్ సర్కార్ పై విరుచుకుపడతారని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధించిన వ్యాట్ పై మాట్లాడిన మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఈ నేపథ్యంలో మోడీ పర్యటన పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Recommended Video


ఈ నెల చివరి వారంలో ఏపీకి అమిత్ షా, జేపీ నడ్డా
మోడీ టూర్ వచ్చేనెలలో ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల చివరి వారంలో ఏపీకి వస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జేపీ నడ్డా పర్యటన ముగిసింది. అమిత్ షా పర్యటన కూడా కొనసాగనుంది. ఇదే క్రమంలో ఏపీలోనూ వీరిద్దరి పర్యటన తర్వాత వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా 2024 ఎన్నికలను గురిపెట్టి బీజేపీ అగ్రనేతలు చేస్తున్న పర్యటనలు ఏ మేరకు బిజెపికి లబ్ధి చేకూరుస్తాయనేది వేచిచూడాలి.












Click it and Unblock the Notifications