ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు - వదిలేసారు : మోసానికి గురయ్యా : మోహన్ బాబు సంచలనం..!!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను వాడుకొని వదిలేసారంటూ వాపోయారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డానని చెప్పారు. తనతో ఎన్నికల ప్రచారం చేయించుకున్నారని, కానీ, తనకు ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో రకాలుగా మోసానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసారు. తన జన్మదినం సందర్భంగా మోహన్ బాబు తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ సంస్థల ఆవరణ లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో మోహన్ బాబు తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు. మోహన్ బాబు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరోక్షంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి చేసినవా అనే చర్చ మొదలైంది.

2019 ఎన్నికల్లో వైసీపీ కోసం
2019 ఎన్నికల ముందు అప్పటికే వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మోహన్ బాబు అధికారికంగా వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ వైసీపీ అభ్యర్ధి ఆర్కే కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక, వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు ఖచ్చితంగా నామినేటెట్ పదవి దక్కుతుందని పార్టీలో ప్రచారం సాగింది. ఫిల్మ్ కార్పోరేషన్ ఛైర్మన్ లేదా టీడీపీ బోర్డు ఛైర్మన్ పదవుల్లో ఒకటి దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఏ పదవి దక్కలేదు. ఇదే విషయం పైన మోహన్ బాబు పలు మార్లు స్పందించారు. తాను జగన్ ను సీఎంగా చూడాలనే కోరికతోనే ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం చేసానని..తాను పదవులు ఆశించి కాదని చెప్పుకొచ్చారు.

పెదరాయుడుకు పెద్ద పదవి అంటూ
ఇక, సడన్ గా మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అప్పటి నుంచి సీఎం జగన్ తో మోహన్ బాబు ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్ హయాం లో మోహన్ బాబు నాడు టీడీపీ కోసం ప్రచారం చేయగా, అప్పట్లోనే మోహన్ బాబుకు రాజ్యసభ అవకాశం కల్పించారు. దీంతో..ఇప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవిగానే భావిస్తున్నారు. "మా " ఎన్నికల తరువాత అధ్యక్షుడు విష్ణుతో పాటుగా కమిటీతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తానని మోహన్ బాబు చెప్పారు. కానీ, కలవలేదు. కొద్ది రోజుల క్రితం విష్ణు సీఎం జగన్ ను కలిసారు.

ఏ పదవి దక్కని మోహన్ బాబు
అయితే, అది పూర్తిగా వ్యక్తిగత అంశమని వివరించారు. ఇక, సినీ ఇండస్ట్రీలో సమస్యల పైన చిరంజీవి నాయకత్వంలో హీరోల టీం సీఎం జగన్ ను కలిసింది. ఆ సమయంలోనూ మోహన్ బాబు ఆ టీంలో లేరు. అయితే, తమకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉందని, కానీ..తమకు ఇన్విటేషన్ అందకుండా కొందరు చేసారంటూ విష్ణు చెప్పుకొచ్చారు. ఇక, తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సమయంలో తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మోహన్ బాబు ప్రకటించారు. కొద్ది కాలం క్రితం తమ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలోనూ మోహన్ బాబు స్పందించారు. సీఎం జగన్ పక్కన ఉండే అధికారులు ఆయన్ను తప్పు దోవ పట్టిస్తున్నారనేది తన అభిప్రాయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తాజా వ్యాఖ్యలతో వైసీపీలో కలకలం
ప్రస్తుతం ఆలీకి జగన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తన జన్మదినం నాడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ పాల్గొన్న కార్యక్రమంలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు కారణమవుతున్నాయి. తాను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని.. జీవితం గురించి ఇప్పుడు తెలుస్తోందంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన ఎటువంటి రియాక్షన్లు వస్తాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications