చదువే రానోళ్లు: కాలేజ్ ఫంక్షన్లో మోహన్బాబు పంచులు
స్వామీజీలు, గూండాలు, రాజకీయ నాయకులు దేశాన్ని కొల్లగొడుతున్నారని, వీరి అన్యాయాలను ఎదిరించే దిశగా యువత చైతన్యవంతం కావాలన్నారు. దేశాన్ని రక్షించే బాధ్యత యువతపై ఉందన్నారు. దేశాన్ని స్వామీజీలు, గూండాలు, రాజకీయ నాయకులు శాసిస్తూ జాతి సంపదను దోచుకుంటున్నారని వాపోయారు. సంఘంలోని విద్యావంతులు, మేధావులు, కళాకారులపై దౌర్జన్యాలు చేస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని ఆరోపించారు.
రాజకీయవేత్తల వద్ద ఉన్న డబ్బంతా ప్రజలను మోసం చేసి సంపాదించిన సొమ్మేనన్నారు. ప్రస్తుతం చాలా మంది నాయకులు ప్రజల ఆస్తులను దోచుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు, గూండాలు, స్వామీజీల వ్యవస్థ గురించి మోహన్బాబు తన తాజా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నారు.
"ఫస్ట్ క్లాస్లో పాసైన వారు ఐఏఎస్, ఐపిఎస్లుగా వెళతారు. సెకండ్ క్లాసులో పాసైన వారు ఎంబిఏ, ఇంజనీరింగ్ వృత్తులు ఎంచుకొంటారు. థర్డ్ క్లాసులో పాసైన వారు రాజకీయ నాయకులవుతారు. వీరు పై రెండు తరగతుల వారిని శాసిస్తారు. ఫెయిల్ అయిన వారు గూండాలు, రౌడీలు అవుతారు. వీరు దౌర్జన్యంతో పై మూడు తరగతులను శాసిస్తారు. అసలు చదువే రానివారు స్వామీజీలవుతారు. వీరు అందరినీ శాసిస్తారు. అందరు వెళ్ల వారి కాళ్లపై పడతారు. ఇదీ ప్రస్తుతం సమాజమున్న తీరు'' అంటూ డైలాగ్ను వినిపించారు.