మరోమారు తెరపైకి మోహన్ బాబు పేరు .. ఆ పదవి ఆయనకేనని ప్రచారం .. రూమర్స్ అంటున్న మోహన్ బాబు
ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతుంది . టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా చేసిన అంబికా క్రిష్ణ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై చాలా మంది సినీ ప్రముఖుల దృష్టి పడింది. ఇక నామినేటెడ్ పదవుల రేసులో మొదట నుండి మోహన్ బాబు ఉన్నారు. టీటీడీ చైర్మన్ గా అవకాశం కోసం మోహన్ బాబు రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా వై ఎస్ జగన్ తన బాబాయి వై వీ సుబ్బారెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. ఇక తాజాగా మరోమారు ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
జగన్ ప్రభుత్వంలో మోహన్ బాబుకు కీలక పదవి ? రాజకీయ , సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు' అని ఆశాభావం వ్యక్తం చేస్తూ , అందుకోసం తమ వంతు పని చెయ్యాలని భావించి ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు సినీ నటుడు మోహన్ బాబు .ఇక మోహన్ బాబు మాత్రమే కాదు సినీపరిశ్రమలో ఉన్న జయసుధ , జీవితా రాజశేఖర్, ఆలీవంటి సినీ ప్రముఖులు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. పృథ్వీ, పోసాని, హేమ, రాజా రవీంద్ర, భాను చందర్, కృష్ణుడు, శ్యామల ఇలా చాలా మంది వైసీపీ తరుపున ప్రచారం చేశారు. అన్నట్టుగానే వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయ్యారు. దీంతో జగన్ టీంలో కీలక పదవి కోసం వీరంతా పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా పేరు వినిపిస్తుంది మాత్రం మోహన్ బాబుదే . ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు అన్న దానిపై ఏపీలోని రాజకీయ వర్గాల్లో, సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతుంది. మోహన్ బాబుకే ఆ అవకాశం వరిస్తుంది అని చర్చ జోరుగానే సాగుతుంది.
ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా మోహన్ బాబుకు జగన్ అవకాశం అని వైరల్ అవుతున్న వార్త
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబుకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించనున్నట్లు మరోసారి వార్తలు దుమారం రేపుతున్నాయి . మోహన్ బాబుకు జగన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించే ఆలోచన అని ప్రచారం జరిగినా అది నెరవేరలేదు. ఇక ఇప్పుడు మోహన్ బాబును ఎఫ్డీసీ (ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్) చైర్మన్గా నియమించనున్నారన్నప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇదైనా నిజం అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు .
Recommended Video
అంతా పుకార్లని .. నమ్మొద్దు అంటున్న మోహన్ బాబు
అయితే తాజాగా జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు పీఆర్ టీం స్పందించారు. అవన్నీ పుకార్లేనని వారు కొట్టిపారేశారు. ఆ వార్తలు నమ్మవద్దని సూచించారు. గతంలో రూమర్స్ వచ్చినప్పుడు కూడా మోహన్ బాబు స్పందించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడలేదని స్పష్టం చేశారు. అయినా ఈ రూమర్స్ కి మాత్రం ముగింపు పడటం లేదు. ఇండస్ట్రీ పెద్దలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో పాటు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా పని చేసే నేత కాబట్టి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి జయసుధ అయితే బావుంటుందనే అభిప్రాయం కూడా జగన్ కు ఉందని తెలుస్తుంది . కనుక ఈ నేపధ్యంలో ఇప్పుడైనా మోహన్ బాబుకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా అవకాశం జగన్ కల్పిస్తారా అన్నది త్వరలోనే తేలనుంది .