జగనన్న ఇమ్మన్నాడు: ఎంపి అవినాష్రెడ్డి పేరుతో డబ్బు డిమాండ్!
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపి అవినాష్రెడ్డి పేరుతో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. అయితే, అప్రమత్తమైన జగన్మోహన్ రావు ఆ ప్రబుద్ధుడిని పోలీసులకు పట్టించడంతో కథ సుఖాంతమైంది.
సదురు నేత తెలిపిన వివరాల ప్రకారం.. వైయస్సార్ కాంగ్రెస్ ఎంపి అవినాష్ రెడ్డి పేరుతో ఒక వ్యక్తి మంగళవారం రాత్రి స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావుకు ఫోన్ చేసి ‘అన్న (వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి) ఒక పని చెప్పారు. మా కుర్రవాడు ఒకరు బుధవారం ఉదయం మీ వద్దకు వస్తాడు. రూ.4 లక్షలు ఇచ్చి పంపండి' అని ఆదేశించాడు.
అయితే ఫోన్ చేసిన వ్యక్తి మాట తీరుపై అనుమానం కల్గిన డాక్టర్ జగన్మోహనరావు ఈ విషయాన్ని తన సోదరుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్, స్థానిక నాయకులకు తెలియజేశాడు.

బుధవారం ఉదయం మళ్లీ సదరు వ్యక్తి ఫోన్ చేసి ప్రవీణ్ అనే కుర్రవాడు కలుస్తారని డాక్టర్ జగన్మోహనరావుకు తెలియజేయగా అతన్ని కలిసేందుకు పట్టణ పార్టీ అధ్యక్షుడు చిరుమామిళ్ల అశోక్, మరి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు.
కాగా, సదరు వ్యక్తి తొలుత నందిగామకు వస్తున్నట్లు తెలిపి తర్వాత కంచికచర్లలో ఉన్నానని, వచ్చి కలవాలని ఫోన్ చేయగా వీరు అక్కడకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపధ్యంలో జగన్మోహనరావు సోదరుడు అరుణ్కుమార్ స్థానిక నేతలకు ఫోన్ చేసి ఎంపి అవినాష్రెడ్డి ఎవ్వరినీ పంపలేదని తెలియజేశారు.
దీంతో సదరు ప్రవీణ్ అనే యువకుడిని కంచికచర్లలో కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ నేతలు.. అతడ్ని కారులో ఎక్కించుకొని నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దీనిపై బుధవారం రాత్రి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ ఇంఛార్జ్ డాక్టర్ జగన్మోహనరావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపి అవినాష్రెడ్డి పేరుతో ఫోన్ చేసింది సునీల్ అనే యువకుడని నిందితుడు ప్రవీణ్ చెబుతున్నట్లు సమాచారం. నిందితుడి వద్ద నుండి బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications