రుతుపవనాలు వచ్చినా వర్షాలు ఎప్పుడు - తాజా అప్డేట్, ఉపశమనం..!!
తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించి వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. రాత్రి సమయాల్లోనే సెగలు తగ్గటం లేదు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణ..వర్షాల పైన వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
నిప్పుల కొలిమిలా:రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. ఈ సీజన్ లో తొలిసారిగా రాష్ట్రంలో 670 మండలాలకుగాను 370 మండలాల్లో తీవ్ర గాడ్పులు, 132 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8, కాకినాడ అర్బన, కరపలో 46.7, తునిలో 46.3 డిగ్రీలు నమోదైంది.

శనివారం 264 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కోస్తా తీరాలకు దగ్గరలో ఏర్పాటు చేసిన అబ్జర్వేటర్లలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కళింగపట్నంలో శుక్రవారం 43.9 డిగ్రీలు (సాధారణం కంటే 10.8 డిగ్రీలు ఎక్కువ) నమోదుకావడం ఇదే తొలిసారి.
కదలని రుతుపవనాలు:రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయినట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఇప్పటికే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. రుతుపవనాలు నిలిచిపోవడంతో పలు రాష్ట్రాల్లో పడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలో నమోదువుతున్నాయి. జూన్ 15 దాటినా తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతవుతున్నారు. తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే వాతావరణ శాఖ తాజా అంచనాల మేరకు రేపటి నుంచి కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది.
రేపటి నుంచి వర్షాలకు ఛాన్స్:ఈ నెల 17వ తేదీ తరువాత ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో ఈ నెల 17 వరకు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. రాయలసీమ మీదుగా కోస్తా జిల్లాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
అదే సమయంలో తెలంగాణాలోనూ వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. దీని ద్వారా మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల నుంచి క్రమేణా మార్పు కనిపించి.. వర్షాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు.మెరుపులతో వర్షాలు కురుస్తున్నా.. రుతుపవనాల వ్యాప్తితో కురిసే వర్షాల కోసం వేచి చూస్తున్నారు. 19 నుంచి వర్షాలు మొదలవుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications