జగన్, సాయిరెడ్డికి రేపే జడ్జిమెంట్ డే-రఘురామ పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పులు-హైకోర్టు తీర్పూ
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి గతంలో సీబీఐ అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై రేపు సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించబోతోంది. అదే సమయంలో ఈ పిటిషన్లపై విచారణను మరో కోర్టుకు మార్చాలంటూ, అప్పటివరకూ తీర్పు ఇవ్వకుండా సీబీఐ కోర్టును నిలువరించాలంటూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ పైనా తీర్పు రేపే వెలువడబోతోంది. దీంతో రేపు జగన్, సాయిరెడ్డికి బిగ్ డేగా చెప్పుకోవచ్చు.

జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై గతంలో సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో విచారణ తర్వాత సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ పై జగన్, సాయిరెడ్డి బయట ఉన్నారు. వీరిద్దరిపై గతంలో ఇచ్చిన బెయిల్ సందర్భంగా విధించిన షరతుల్ని ఉల్లంఘించారనే ఆరోపణల్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంధించారు. ఇదే ఆరోపణలతో ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ కోర్టు గత నెల 23నే తీర్పులు ఇవ్వాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఈ నెల 15కు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు తీర్పుల్ని రేపు వెలువరించేందుకు సీబీఐ కోర్టు సిద్ధమవుతోంది.

సీబీఐ కోర్టు తీర్పులు అడ్డుకోవాలని రఘురామ పిటిషన్
సీబీఐ కోర్టు రేపు జగన్, సాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై ఇచ్చే తీర్పుల్ని అడ్డుకోవాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ, పిటిషనర్ కూడా అయిన రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ రెండు పిటిషన్లనూ వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో హైకోర్టును కోరారు. దీంతో రఘురామ పిటిషన్ ను అత్యవసరం విచారించిన హైకోర్టు... తీర్పునిు మాత్రం రేపటికి రిజర్వు చేసింది. దీంతో రఘురామ వేసిన తాజా పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తీర్పు ఈ మొత్తం వ్యవహారానికీ కీలకంగా మారిపోయింది.

సీబీఐ కోర్టు తీర్పులు
రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఇప్పటికే తీర్పులు సిద్ధం చేసింది. రేపు వాటిని వెలువరించబోతోంది. అయితే హైకోర్టు తీర్పు కూడా రేపే వెలువడనున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ఇఛ్చే తీర్పులపై ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే సీబీఐ కోర్టు జగన్, సాయిరెడ్డి బెయిళ్ల రద్దుపై తీర్పు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ బెయిళ్ల రద్దు వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇందులో ఏ కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ప్రభావం చూపుతుందో కూడా అర్ధం కాని పరిస్ధిది.

హైకోర్టు ముందా ? సీబీఐ కోర్టు ముందా
జగన్, సాయిరెడ్డి బెయిల్స్ రద్దు కోరుతూ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్లపై రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ తీర్పు కంటే ముందు హైకోర్టు తీర్పు వెలువరించాల్సిన పరిస్ధితి నెలకొంది. దీనికి కారణం రఘురామ దాఖలు చేసిన అత్యవసర పిటిషనే. దీంతో సీబీఐ కోర్టు ఈ రెండు కేసుల్లో తీర్పు వెలువరించాలా వద్దా అన్నది హైకోర్టు నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉదయం హైకోర్టు తీర్పు, మధ్యాహ్నం సీబీఐ కోర్టు తీర్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. లేదా సీబీఐ కోర్టు తీర్పులు వాయిదా పడినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. ఇందులో ఏది జరిగినా పిటిషనర్ గా రఘురామ పాత్ర కీలకంగా మారిపోతోందనడంలో అతిశయోక్తి లేదు.












Click it and Unblock the Notifications