విశేషం:పోలవరంలో వెలుగు చూసిన ప్రాచీన వస్తువులు:కొనసాగుతున్న తవ్వకాలు
పశ్చిమ గోదావరి:పోలవరం ముంపు మండలాల్లో పురావస్తు శాఖ జరుపుతున్న తవ్వకాల్లో అత్యంత ప్రాచీన వస్తువులు వెలుగుచూడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడి ముంపు ప్రాంతాల్లోని పురాతన సంపద కూడా కాలగర్భంలో కలసిపోతుందనే ఉద్దేశంతో పురావస్తు శాఖ ఐదు నెలలుగా ఇక్కడ తవ్వకాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి పురాతన సమాధులు బైటపడగా వాటన్నింటినీ వెలికితీస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా సుమారు 200 వరకు సమాధులను గుర్తించి, వాటి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని సమాధుల్లో ప్రాచీన రాతి యుగం నాటి టెర్రాకోట మట్టితో తయారు చేసిన పక్షి, తాబేలు రూపాల్లో వివిధ వస్తువులు బయటపడినట్లు పురావస్తు అధికారులు తెలపడం ఆసక్తికరంగా మారింది.
తవ్వకాలు...జరుపుతోంది ఇలా
ఎపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరుపుతున్నట్లు పురావస్తు శాఖ కమిషనర్ వాణీ మోహన్ తెలిపారు. ఇలాంటి తవ్వకాలు దక్షిణ భారతదేశంలో ఇంకెక్కడా జరగలేదని ఆమె చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాయునిపేట వద్ద, పశ్చిమగోదావరి జిల్లా రుద్రమకోట వద్ద మెగాలిథిక్ సంస్కృతి విలసిల్లిన ప్రాంతాల్లో నాలుగు నెలల నుంచి తవ్వకాల జరుపుతున్నామని ఆమె వివరించారు. తవ్వకాలు జరిగే ప్రాంతంలో ఆది మానవుల, జీవన విధానం నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ వ్యవస్థ, ఆదర్శవంతమైన మానవ నాగరికత వైపు అడుగులు వేస్తున్న మధ్య సంధి యుగంగా మెగాలిథిక్ సంస్కృతి అంశాలు బయటపడుతున్నట్లుగా ఆమె వెల్లడించారు.
తాజాగా...వెలుగు చూశాయి...
ఆనాటి కాలంలో అక్కడ నివసించిన ఆటవికులు మరణించిన వారితోపాటు వారికి సంబంధించిన వస్తువులను కుండలలో భద్రపరచి సమాధిలో పూడ్చిపెట్టినట్లు పురావస్తు అధికారులు గుర్తించారు. గత ఐదు నెలల నుంచి దాదాపు యాభైకి పైగా సమాధుల తవ్వకాలు పూర్తి చేశామని, మిగిలిన వాటిని మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలవరం ముంపు గ్రామాల పరిధిలో 370 తండాల్లో తవ్వకాలు చేపట్టగా 341 పురాతన శిల్పాలు, వివిధ రూపాల్లో ఉన్న 109 రకాల వస్తువులను వెలికితీసిటనట్లు, అందులో పక్షి,తాబేలు వంటి ఆకృతుల పాత్రల వంటివి ఉన్నట్లు వారు తెలిపారు. వీటి వివరాల గురించి శాస్త్రీయంగా పరిశోధించేందుకు ఎక్కువ సమయం పడుతుందని వారు వెల్లడించారు.
తవ్వకాలు...ఎక్కడెక్కడంటే?
పోలవరం ముంపు గ్రామాలైన వేలేరుపాడు మండలం రుద్రమకోట, యటపాక మండలం రాయనిపేట గ్రామాల్లో రాతికాలం నాటి సమాధులలో పురావస్తు శాఖ ప్రస్తుతం తవ్వకాలు నిర్వహిస్తోంది. విఆర్ పురం మండలం చినమెట్లపల్లి, తూర్పుగోదా వరి జిల్లా జిల్లెలగూడెం లో మరికొన్ని సమాధుల తవ్వకాలు మరో నెలరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ తవ్వకాలన్నీ పూర్తి చేసిన తరువాతే వీటిలో బయల్పడ్డ పురాతన వస్తువులపై శాస్త్రీయ పరిశోధన చేస్తామని వారు వెల్లడించారు.
పరిశోధన...ఖర్చు
అయితే ఈ విగ్రహాలపై పరిశోధన బాగా ఖర్చుతో కూడుకున్నదని, ఒక్కో శిల్పం పరిశోధనకే సుమారు రూ 45 వేలు ఖర్చవుతుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. విఆర్ పురం మండలం వడ్డెగూడెం, కుకునూరు మండలం కౌండిన్యముఖి గ్రామాల్లోని ఆలయాలను తరలించేందుకు రూ 2 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు వెల్లడించారు. అలా ఈ పురాతన వస్తువుల తవ్వకాలకు, శాస్త్రీయ పరిశోధనకు మొత్తం కనీసం రూ 4.5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడ్డ పురాతన వస్తువులపై పరిశోధనలు పూర్తయ్యాక వీటిని పోలవరం ప్రాజెక్టు పరిధిలోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేసి, వాటిని ప్రదర్శనకు పెట్టేలా ప్రతిపాదనలు ఉన్నాయని పురావస్తు అధికారులు తెలిపారు.