మోస్ట్ వాంటెడ్: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ రెడ్డిని పట్టుకున్న చిత్తూరు పోలీసులు!!
కడప జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ వింజమూరు రామనాథ రెడ్డిని చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రామనాధ రెడ్డిని పోలీసులు కుప్పం - కృష్ణగిరి హైవేలో అరెస్టు చేశారు. ఎర్ర చందనాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు రామనాధ రెడ్డితో పాటుగా అతని అనుచరులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లలో ఒకరిగా ఉన్న రామనాధరెడ్డిని అరెస్ట్ చేయడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల అదుపులో ఇంటర్నేషనల్ ఎర్ర చందనం స్మగ్లర్ రామనాథ రెడ్డి
పోలీసులు అదుపులోకి తీసుకున్న రామనాధ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ లో ఒకడని పోలీసులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ఏపీ పోలీసులు వరుసగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న స్మగ్లర్ లను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామనాధ రెడ్డి యాక్టివిటీస్ పైన నజర్ పెట్టిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పక్కా సమాచారంతో అంతర్జాతీయ స్మగ్లర్ రామనాధ రెడ్డిని అరెస్ట్ చేశారు.

లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా అరెస్ట్
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో జాతీయ రహదారి పై నిఘా పెట్టి 12 టైర్ లారీ లో తరలిస్తున్న 62 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఇక ఎర్రచందనం దొంగల లారీకి ఎస్కార్ట్ గా స్కార్పియో వాహనంలో తన అనుచరులతో వెళుతున్న స్మగ్లర్ రామనాథ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు యాభై లక్షలు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.

ఏపీలో జోరుగా ఎర్ర చందనం స్మగ్లింగ్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్మగ్లర్లు, అంతర్రాష్ట్ర దొంగలు మాత్రమే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పేరు మోసిన క్రిమినల్స్, రౌడీషీటర్ల ప్రమేయం కూడా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా నిదానంగా చాప క్రింద నీరులా ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా విస్తరిస్తోంది. ఈ పరిణామాలు పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇటీవల పలు ఘటనలలో పట్టుబడిన స్మగ్లర్లు
ఇక ఇటీవలే చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అడవిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఇరవై ఒక్క మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అందులో మైనర్లు కూడా ఉన్నారు. అంతకు ముందు చిత్తూరు జిల్లా భాకరాపేట అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో, ఈత గుంట ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం దుంగలను మోసుకొని వెళుతూ కనిపించడంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా ఎర్రచందనం దుంగలను పట్టుకోవటంతో పాటు ఇంటర్నేషనల్ స్మగ్లర్ ను కూడా అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications