ఒత్తిళ్లు వచ్చినా ఎర్రచందనం స్మగ్లర్ లతీఫ్ అరెస్ట్, ఢిల్లీలో మకాం వేసి హసన్ను..
చిత్తూరు/తిరువనంతపురం: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ లతీఫ్ను చిత్తూరు జిల్లా పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. అతనిని అరెస్టు చేసేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు తీవ్రంగా శ్రమించారు. లతీఫ్కు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో, లతీఫ్ను అరెస్టు చేసేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లుగా సమాచారం. లతీఫ్ ఎర్ర చందనం స్మగ్లర్ కేసులో నిందితుడే కాకుండా... హత్య కేసులోను నిందితుడు. రౌడీషీట్ ఉంది. అయితే, ఎట్టకేలకు అతనిని అరెస్టు చేశారు.
లతీఫ్... చిత్తూరు, కడప జిల్లాల నుంచి ఎర్రచందనం దుంగలను దుబాయ్కు తరలిస్తుంటాడు. ఇతనిని సోమవారం రాత్రి కేరళలో అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ కుమారపుత్తూరు పంచాయతీ పల్లికూనూరుకు చెందిన ఎ అంబుది కుమారుడు లతీఫ్ గత నాలుగు సంవత్సరాలుగా కేరళలోని సముద్ర తీరం ద్వారా దుబాయ్, చైనా దేశాలకు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు.
తొలుత ఇతను డ్రైవర్గా ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. తరువాత చేపల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. చేపల వ్యాపారం మాటున శ్రీగంధం ఎగుమతి చేసేవాడు. వీరప్పన్ మృతితో శ్రీగంధం వ్యాపారం మానివేశాడు.
తిరిగి చేపల వ్యాపారం నిర్వహిస్తున్న లతీప్ గత ఐదు సంవత్సరాల క్రితం ఎర్రచందనం అక్రమ వ్యాపారంలోకి ప్రవేశించి దాదాపు 700 కోట్ల రూపాయలు గడించాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో నెట్వర్క్ పెంచుకొని ఎర్రచందనం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు.
ఇప్పటి వరకు సుమారు వెయ్యి టన్నులకు పైగా విదేశాలకు ఎర్రచందనం ఎగుమతి చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ముంబైలో పట్టుబడిన రాజుబాయ్ ఇచ్చిన సమాచారం మేరకు లతీఫ్ను చిత్తూరు టాస్క్ఫోర్స్ పోలీసులు, తాలూకా సిఐలు చంద్రశేఖర్, ఆదినారాయణ బృందాలుగా విడిపోయి గత మూడు రోజులుగా కేరళలో రెక్కి నిర్వహించారు. ఎర్రచందనం ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
ఇతను దుబాయ్లోని సాహుబాయ్కి ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ పి గంగిరెడ్డితో కూడా లతీఫ్కు సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. లతీఫ్ను విచారిస్తే మరికొంత మంది స్మగ్లర్లు బయటపడే అవకాశం ఉంది.
నిన్న హసన్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఢిల్లీకి చెందిన బద్రుల్ హసన్(54)ను సోమవారం కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం టాస్క్ఫోర్స్ అధికారులు రాజంపేట డిఎస్పీ అరవింద బాబు, సిఐ రాజేంద్రప్రసాద్, రైల్వేకోడూరు సిఐ రసూల్ సాహెబ్ తదితరులు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసి హసన్ కదలికలపై నిఘా పెట్టారు.
ఢిల్లీలోని బిడ్జిపూర్ ఇంట్లో ఉన్న హసన్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పలాక్షలోని గోడౌన్లో దాచిన ఎనిమిది టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. హసన్ను గట్టి భద్రత మధ్య కడపకు తీసుకు వస్తున్నారు.
హసన్ కడప జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను స్థానిక స్మగ్లర్ల వద్ద కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి చైనా, నేపాల్ దేశాలకు ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు సమాచారం. హసన్కు సహకరిస్తున్న ఇతర దేశాల స్మగ్లర్ల గుట్టు రట్టుచేసే పనిలో జిల్లా పోలీసులు ఉన్నారు. కాగా, హసన్ పైన క్రిమినల్ కేసులు కూడా నమోదై ఉన్నట్లుగా తెలుస్తోంది.