రైలు టాయిలెట్ వాష్ బేసిన్లో పసికందు; మాతృత్వాన్ని మరచిన తల్లి; అమానవీయఘటనపై స్పందించిన రైల్వే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్నతల్లి అప్పుడే పుట్టిన పసికందును రైల్వే టాయిలెట్లోని వాష్ బేసిన్ లో వదిలివెళ్లిన ఘటన అందరి మనసులను కలచివేస్తోంది. అమ్మ ఒడిలో ఉండాల్సిన, తల్లి పాలు తాగుతూ సేద తీరాల్సిన పసికందు మరుగుదొడ్డిలో, మురుగు వాసన మధ్య ఉన్న దృశ్యం ఆవేదన కలిగించింది.

అప్పుడే పుట్టిన నవజాత శిశువును వదిలివెళ్ళిన తల్లి
అమ్మ లేక అనాధగా మారిన ఆ శిశువు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తూ కనిపించిన ఘటన రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల మనసులను కలచివేసింది. భూమి మీద పడగానే ఏ పాపమూ తెలియని, అన్యం పుణ్యం ఎరుగని ఆ శిశువును తల్లి అనాధను చేసి వెళ్ళిపోయిన ఘటన అందరికీ బాధను కలిగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు అసని తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుంటే, అదే సమయంలో ఒ శిశువును కన్నతల్లి అంతే భయానక నిర్ణయాన్ని తీసుకుంది. పేగు పాశం మరచిపోయి ప్రవర్తించింది. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చింది.

రైలు టాయిలెట్ వాష్ బేసిన్ లో మగ శిశువు లభ్యం
విశాఖలో ట్రైన్ నెంబర్ 13351 ధన్ బాగ్ అలెప్పి ఎక్స్ ప్రెస్ రైల్లో టాయిలెట్లో ఓ కఠినాత్మురాలైన తల్లి నవజాతశిశువు వదిలివేసిన ఘటన కలకలం రేపింది. రైల్వే టాయిలెట్లో ఓ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది . పుట్టిన కాసేపటికే బీ వన్ బోగి టాయిలెట్ వాష్ బేసిన్ లో మగ శిశువును తల్లి విడిచి వెళ్ళింది. పసికందు ఏడుపు విన్న రైలు ప్రయాణికులు శిశువు గురించి ఆన్ బోర్డు టీటీ ఈ వి. బ్రహ్మాజీ కి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చూడ చక్కగా ఉన్న పండంటి మగ బిడ్డను వదిలి వెళ్ళటానికి తల్లికి మనసెలా వచ్చింది అన్న చర్చ ప్రయాణికుల్లో జరిగింది.

మానవతా దృక్పధంతో స్పందించిన రైల్వే సిబ్బంది
పసికందును వదిలివెళ్ళిన ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. శిశువును వదిలివేసిన ఘటనపై మానవతా దృక్పథంతో స్పందించారు. ఆర్పిఎఫ్ పోలీసులు రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆస్పత్రికి తరలించారు. మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ పసికందును ప్రేమగా తమ చేతుల్లోకి తీసుకుని, ఏడుస్తున్న శిశువును అనునయించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే శిశువు సంరక్షణ, మెరుగైన చికిత్స నిమిత్తం శిశువుని కేజీహెచ్ కు తరలించినట్టు సమాచారం.

తల్లి స్వచ్ఛందంగా వచ్చి బిడ్డను తీసుకు వెళితే, ఆ బిడ్డ పెంపకానికి సహకరిస్తామన్న రైల్వే సిబ్బంది
పసికందును ఎవరు విడిచి వెళ్లారు అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. శిశువును వదిలి వ్ల్లిన తల్లి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి కావచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు శిశువు తల్లి స్వచ్ఛందంగా వచ్చి బిడ్డను తీసుకు వెళితే, ఆ పసికందు పెంపకానికి తాము సహకరిస్తామని చెబుతున్నారు. మరి ఆ తల్లి హృదయం శిశువు విషయంలో కరుగుతుందో లేదో కాలమే చెప్పాలి.












Click it and Unblock the Notifications