ఏపీలో థియేటర్ల మూసివేత- యంగ్ హీరో ఎమోషనల్ : ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తే...!!
ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు టాలీవుడ్ హీరోల్లో ఆందోళన పెంచుతున్నాయి. కొందరు ప్రముఖ హీరోలు సమస్య పరిష్కరానికి పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు యువ హీరోలు మాత్రం తమ ఎమోషన్స్ ను దాచుకోలేకపోతున్నారు. ఓపెన్ అయిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం పైన పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటం.. వరుసగా థియేటర్ల పైన సోదాలు చేయటం.. థియేటర్లు మూసివేయటం...కొద్ది రోజుల్లో పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదల కానుండటంతో టాలీవుడ్ లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఏపీలో మూతబడుతున్న థియేటర్లు
ఇదే సమయంలో కొందరు అధికారుల సోదాలు భరించలేక స్వచ్చందంగా థియేటర్లు మూసేస్తున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు తాజాగా ఏపీలో థియేటర్ల మూసివేతపై నిఖిల్ భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టింగ్ పెట్టారు. తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటమంటే ప్రేక్షకులను అవమానించటమేనంటూ నాని వ్యాఖ్యానించారు. కిరాణా షాపుకు వచ్చిన కలెక్షన్ కూడా థియేటర్ కు రావటం లేదని చెప్పుకొచ్చారు. దీని పైన ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
యువ హీరో నిఖిల్ ఎమోషనల్
ఇక, ఇప్పుడు మరో యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. వివిధ టైర్ కంపార్ట్మెంట్ల ఆధారంగా ట్రైన్ టికెట్ రేట్లను ఎలా నిర్ణయిస్తున్నారో అలాగే థియేటర్స్ టికెట్ రేట్లను నిర్ణయించాల్సిదిగా కోరాడు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టిక్కెట్ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్తో బాల్కనీ..ప్రీమియం విభాగాన్ని అనుమతించమని అధికారులను కోరుతూ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమస్య పరిష్కారం సాధ్యమేనా
అలాగే, థియేటర్లు నాకు దేవాలయం లాంటివి. ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. థియేటర్లు మూతపడడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషం. ఈ విషయంలో వారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే థియేటర్లు తిరిగి తమ వైభవాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నాను..అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక, టాలీవుడ్ నుంచి చిరంజీవి- నాగార్జున నేరుగా సీఎం జగన్ తో చర్చలు చేయటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. అందులో భాగంగా... చిరంజీవి ముందుగా మంత్రి పేర్ని నాని..ఆ తరువాత సీఎంతో సమావేశం అవుతారని చెబుతున్నారు. కొత్త సినిమాల విడుదల తేదీలు దగ్గర పడే కొద్దీ ఈ సమస్య పైన టాలీవుడ్ లో అందోళన పెరిగిపోతోంది.