ప్రోటోకాల్ వివాదం: కులం పేరుతో దూషించారంటూ ఎంపీ ఫిర్యాదు
విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ వివాదం, కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాయపల్లిలో సెల్ టవర్ల ప్రారంభోత్సవంలో ఎంపీ కొత్త పల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది.
ఎంపీ గీత రాకముందే ఎమ్మెల్యే రాజేశ్వరి సెల్ టవర్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రంపచోడవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంత ఉదయభాస్కర్తో పాటు మరో ముగ్గురిపై ఎంపీ గీత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనన్ని కులం పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దూషించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైయస్ఆర్సీపీ నేత ఉదయ్ భాస్కర్, మరో ముగ్గురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎంపీ గీత ఫిర్యాదు చేసిన వెంటనే, ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్డతీగలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగబాబుతో సహా నలుగురు తనని కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే రాజేశ్వరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.