వైసీపీని వీడటంపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్స్
అధికార వైసీపీలో ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఐ ప్యాక్తో పాటు, సొంత సర్వేల్లో వెనుకపడిన ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. పైగా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ జాగ్రత్త వహిస్తున్నారు.
దీనిలో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలను స్థానం చలనం చేయగా, మరో 11 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ లిస్ట్లో హిందూపురం వైసీపీ ఎంపీ గోరుంట్ల మాధవ్కు సైతం జగన్ షాకిచ్చారు. ఇటీవల విడుదలైన రెండో లిస్ట్లో ఆయనకు చోటు దక్కలేదు. గోరుంట్ల మాధవ్ స్థానంలో మహిళ నేత , బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎంపీ గోరుంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకొనొక సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డితో గొడవకు కూడా దిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గోరుంట్ల మాధవ్ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.
తాజాగా దీనిపై గోరుంట్ల మాధవ్ తనదైనశైలిలో స్పందించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని.. పార్టీ నాకు తల్లి లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని.. సోషల్ మీడియాలో నాపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని గోరుంట్ల మాధవ్ తెలిపారు.
టికెట్ విషయంలో తాను పార్టీ పెద్దలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని.. టికెట్ వచ్చిన రాకపోయిన పార్టీలోనే కార్యకర్తగా కొనసాగుతానని గోరుంట్ల మాధవ్ పేర్కొన్నారు. వైసీపీలోనే ఉండి చావో రేవో తేల్చుకుంటానని చెప్పి సంచలన కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications