ఎంపీ కేశినేని మరో సంచలనం: వైసీపీలోకి పంపించే బదులు- సొంత పార్టీపై : నాని వెనకున్నదెవరు..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన పార్టీ పైన తన ఆగ్రహం - ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. విజయవాడ టీడీపీలో ఇప్పుడు ఎంపీ కేశినేని నాని వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు -రచ్చకు కారణమవుతోంది. కేశినేని నాని సోదరుడు చిన్ని పైన ఎంపీ నాని పోలీసులకు - పార్లమెంట్ సెక్రట్రీకి ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో ఆయన సోదరుడు చిన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇక, ఢిల్లీలో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఇప్పుడు తాజాగా కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా మరో పోస్టు చేసారు. ఇప్పుడు అది పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

కేశినేని నాని తాజా పోస్టు వైరల్
అందులో ఆయన.. యదార్ధవాది.. లోక విరోధి అనే సామెత గుర్తు వస్తోంది. నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది..అంటూ కేశినేని నాని పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి పోస్టు చేసారు. అయితే, కేశినేని పూర్తిగా పార్టీకి దూరం అవుతున్న క్రమంలోనే ఈ పోస్టులు పెడుతున్నారనే చర్చ సాగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ.. కేశినేని నాని తన బస్సుల వ్యాపారం విషయంలో నాటి రవాణా మంత్రి అచ్చెన్నాయుడు పైన ఫైర్ అయ్యారు. ఆ తరువాత బస్సుల వ్యాపారాన్ని వదులుకున్నారు. 2019లో తిరిగి ఎంపీగా గెలిచిన తరువాత.విజయవాడ నగర టీడీపీలో ముసలం ప్రారంభమైంది.

ఎంపీ నాని ఇక టీడీపీలో ఉండరా
నగర టీడీపీ నేతలు- మాజీ మంత్రితో ఎంపీ కేశినేని మధ్య అంతరం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని కేశినేని నాని చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, కేశినేని వ్యవహార శైలి.. పార్టీకి దూరంగా ఉంటున్న క్రమంలో టీడీపీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచన మొదలు పెట్టింది. చాలా రోజులు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న కేశినేని నాని.. పార్టీ కార్యాలయం పైన దాడి తరువాత చంద్రబాబు దీక్ష రోజున పార్టీ ఆఫీసుకు వెళ్లి..చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి..రాష్ట్రపతికి ఇదే ఘటన పైన ఫిర్యాదు సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. తాజాగా.. రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము విజయవాడకు వచ్చిన సమయంలోనూ నాని కీ రోల్ పోషించారు.

పార్టీ నాయకత్వ తీరుపై గుర్రుగా
బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న కేశినేని నాని.. టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పార్టీలోనే జరిగింది. అదే విధంగా.. ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. దీని పైన ఎంపీ నాని ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించకుండానే తన ఆగ్రహం బయట పెడుతున్నారు. పార్టీలో కొందరు నేతల తీరు పైన కేశినేని నాని నేరుగా పలు సందర్భాల్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. అయినా, వీరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటంతో నాని ఆగ్రహంతో ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించటం లేదు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేది కేశినేని నాని అంచనా.

పార్టీలో ఉంటూనే ఇలా ముందుకు..
అదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాని పార్టీ మారుతారనే ప్రచారం మరోసారి పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ, పార్టీ అధినాయకత్వం మాత్రం నాని వ్యవహారంలో ఓపెన్ గా ఏ విషయం చెప్పటం లేదు. ఇప్పుడు నాని సైతం నేరుగా పార్టీ పేరు ప్రస్తావించకుండానే..తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు. దీంతో..కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తరువాతనే ముందుకు కదులుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, కేశినేని నానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నేతల మద్దతుతోనే తన నిర్ణయాలు తాను తీసుకుంటున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications