సామాన్య మహిళగా వెళ్తే కొత్తపల్లి గీతను పట్టించుకోలేదు, ఎంపీ అని తెలిశాక..
విశాఖ: తాను ఓ సామాన్య మహిళగా ఆసుపత్రికి వెళ్లానని, అయితే తనను ఎవరూ పట్టించుకోలేదని అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం నాడు ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోను పేదలకు సరైన వైద్యం అందటం లేదని ఆమె వాపోయారు.
సరిపడా వైద్యులు, మౌలిక సదుపాయాలు లేక ఎక్కడికి అక్కడే వైద్యం పడకేసిందని చెప్పారు. సామాన్య మహిళగా ఆసుపత్రికి వెళ్లిన తనను కనీసం ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎంపీ అని తెలిసిన తర్వాత మాత్రమే హడావుడి చేశారన్నారు. ఆసుపత్రి పరిస్థితిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

నీటి ఎద్దడి లేకుండా చూడాలి: చంద్రబాబు
రాయలసీమ జిల్లాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ నీటి భద్రతతోపాటు నీటి బాధ్యత కూడా ఉండాలని సూచించారు. నీరు-ప్రగతిపై వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంకా వర్షపాతం లోటు ఆరు శాతం ఉందని, భూగర్భ జలమట్టం గతేడాది కన్నా ప్రస్తుతం రెండు మీటర్ల పైన పెరిగిందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండాలంటే ఇంకా 12 టీఎంసీలు రావాలని, నాగార్జునసాగర్ నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు రావాలన్నారు.
నీటి నిర్వహణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కృష్ణాలో ఎగువన నీటిప్రవాహం లేకున్నా దిగువ నీటి ప్రవాహాల వల్ల పులిచింతల నిండింది, కొంతవరకు మన చింత తీరిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వరదలు వచ్చినప్పుడు నీటిని కాపాడుకోవాలని, కరవులో ఆనీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి ప్రణాళిక అతిముఖ్యమైన అంశమని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications