ఆట మొదలైంది: ఎంపీ రఘురామ
వైఎస్సార్సీపీ లో సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న సమరంగా తిరుగుబాటును అభివర్ణించారు. ఆత్మాభిమానానికి ఒకప్పుడు తాను ప్రతీక అయితే, తాజాగా ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిలువెత్తు అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇన్నిరోజులుగా ఓపిక పట్టినవారు, అవమానాలను సహించినవారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు.
పింఛన్లు తొలగించిన తర్వాత గడప గడపకు మన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించారని, ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి సైతం ప్రశ్నించారనే విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు.
డీఎల్ తమపార్టీలో ఉన్నారో? లేరో? తెలియదని సజ్జల అనడంపై ఎంపీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 32 సంవత్సరాల వయసులోనే ఉమ్మడి ఏపీకి రెవెన్యూశాఖ మంత్రి డీఎల్ చేశారని, అంతటి సీనియర్ నాయకుణ్ని ఎవరు బతిమాలి పార్టీలోకి తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసన్నారు.
ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రజలకు మనం ఏం చేశామని ఓట్లు అడగమంటారు? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రోడ్లపై గుంతలనే ఇంకా పూడ్చలేదని, అలాంటిది బటన్ నొక్కాను.. పింఛన్లు ఇచ్చాని సీఎం చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
చంద్రబాబునాయుడు గతంలో పింఛన్లు ఇవ్వలేదా? అన్నారు. రూ.200 ఉన్న పింఛనును రూ.2000 చేసిన చంద్రబాబునే ప్రజలు ఓడించారని, అటువంటిది రూ.2వేల పింఛను రూ.3వేలు చేస్తానని చెప్పి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతుంటే ప్రజలు ఓట్లేస్తారా? అని ఆనం అడిగారు.