మాటకు మాట : టీడీపీ అధ్యక్ష పదవిపై విజయసాయి వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో ఏపీలో రచ్చ కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ మీద విరుచుకుపడే విజయసాయి రెడ్డి తాజాగా యువ ఎంపీ రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారు . ఇక ఆయనకు ఎర్రన్నాయుడు కుమారుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అదిరిపోయే సమాధానం ఇచ్చారు .
పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్
యువనేతను బలిపీఠం ఎక్కిస్తున్నారని విజయసాయి వ్యాఖ్యలు
ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామ్మోహన్ నాయుడికి అధ్యక్ష పదవి కట్టబెడుతున్నారంటూ యువనేతను బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. రామ్మోహన్ నాయుడుకి ముళ్ళ కిరీటం తగిలిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుణ్ణి బలిపీఠం ఎక్కిస్తున్నారు అని ఆయన తాను చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు సీనియర్లంతా చేతులెత్తేస్తే, రామ్మోహన్ నాయుడు టిడిపి అధ్యక్షుడిగా నియమించబోతున్నారంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఘాటుగా స్పందించిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఎప్పుడు ఏ విషయం మీద పెద్దగా స్పందించని, విమర్శలు పెద్దగా లెక్క చేయని రామ్మోహన్నాయుడు ఇక ఈ వ్యవహారంలో మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. మాటకు మాట సమాధానం ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఎలా అయితే తన ట్వీట్ లో రాశారో అంతే ఘాటుగా రివర్స్ పంచ్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. ఇక రామ్మోహన్ నాయుడు పెట్టిన ట్వీట్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని,విజయసాయిరెడ్డిని మామ అల్లుడుగా పేర్కొన్నారు.
మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర
అల్లుడేమో అవినీతి తిమ్మరాజు, పనికి పోతురాజు. సీనియర్ లందరూ చేతగానోడి పాలన చూసి ఛీ కొడుతున్నారు. ఇక కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ఉత్తరాంధ్ర రైల్వేజోన్ పట్టా లెక్కించడం కూడా చేతకాలేదు. ఇక రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మూడు ముక్కలాట మొదలుపెట్టిన మూతి ముడుచుకుని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడు వల్ల ఏ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదు. ఢిల్లీలో కాళ్ళు మొక్కడం, ట్విట్టర్లో రెచ్చిపోవడం మాని, రాష్ట్రసమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు విజయసాయిరెడ్డి గారు అంటూ చాలా ఘాటుగా సమాధానం చెప్పారు రామ్మోహన్ నాయుడు.
రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానానికి టీడీపీ నేతలు హర్షం
ఇక విజయసాయి వ్యాఖ్యలకు,రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానం దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఇచ్చారని టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన విజయసాయి రెడ్డి పంథా మార్చుకోవాలని లేనిపోనివి చిత్రీకరించి, ఊహాగానాలను ప్రచారం చేసే వైఖరి మార్చుకోవాలని వారంటున్నారు. రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలతో నైనా బుద్ధి తెచ్చుకోవాలని , మారాలని కోరుతున్నారు.