ప్రత్యేక హోదా పై ఏం తేల్చారు .. జగన్ మోడీని ఏం అడిగారు : ఎంపీ రామ్మోహన్ నాయుడు సూటి ప్రశ్న
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కానీ సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతో, కేసుల నుండి బయట పడటం కోసం ఎంపీలను వాడుకుంటూ ముందుకెళుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పై ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై జగన్ ను సూటిప్రశ్న వేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
వైసిపి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ని నిలదీసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో నాలుగవ అతిపెద్ద పార్టీగా ఉండి 22 మంది ఎంపీలు ఉండి ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంటే భయపడే పారిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట మరచి వైసిపి ప్రవర్తిస్తోంది అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కేవలం కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి వెళ్ళారంటూ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

ఢిల్లీలో జగన్ ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్
సీఎం జగన్ ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో ఏ విధమైన ఒత్తిడి తీసుకు రాలేకపోయారని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే విషయంలో కూడా ఏ విధమైన పురోగతి లేదని వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు రామ్మోహన్ నాయుడు. ఎన్డీయేతో కలిస్తే మంత్రి పదవి వస్తుందని ఉత్సాహం కనిపిస్తోంది కానీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్న ఆరాటం కనిపించడం లేదంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

22మంది ఎంపీలు పార్లమెంట్ లో చేసిందేమిటి ?
జగన్ తన స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టినట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో మీకు అవకాశం ఇస్తే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 22 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్లో ఇప్పటివరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగించి సాధిస్తారని ప్రజలు అనుకుంటే మీరు చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు.
Recommended Video

స్వప్రయోజనాలు , కేసుల నుండి బయట పడటం కోసమే జగన్ కు సీఎంగా
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడితే మద్దతు ఇస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సీఎం పదవిని జగన్ మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు కేవలం చంద్రబాబు ,టిడిపి నేతలను బెదిరించడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్మోహన్ నాయుడు . కేంద్రం నుండి రావాల్సిన నిధులను , పెండింగ్ బకాయిలను తీసుకురాలేని, విభజన హామీలకై పోరాటం చెయ్యలేని స్థితిలో వైసీపీ ఎందుకు ఉందని ప్రశ్నించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు .












Click it and Unblock the Notifications