దేశంలోని హవాలా ఆపరేటర్లంతా చంద్రబాబు కనుసన్నల్లోనే: వదిలిపెట్టని సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ కావడంతో వైసిపి నాయకులు చంద్రబాబును టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందు వరుసలో ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో మారు సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకి దోచుకోవడం మాత్రమే తెలుసని, అక్రమంగా సంపాదించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు.
అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచి పోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశ పడతారని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కానీ చంద్రబాబు అండ్ కంపెనీ మాత్రం అధికారం ఉంటే యదేచ్ఛగా దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తారని విమర్శించారు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలని, అందుకే బాబు ఆలోచన ఎప్పుడు పవర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాదు చంద్రబాబు మనసులోని మాటను చెబుతున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టిన విజయసాయిరెడ్డి " కేంద్రం వద్ద ఐటీ డిపార్ట్మెంట్ ఉంటే భయపడతానా? ఒక్కరోజులో స్టే తెచ్చేస్తా.. ఎన్ని నోటీసులు ఇస్తారో ఇచ్చుకోండి" అని గట్టిగా అరవాలనుకుంటాడు చంద్రబాబు అంటూ పేర్కొన్నారు. కానీ వార్నింగ్ లైట్ వెలిగి మళ్లీ సైలెంట్ అయిపోతాడని, పొరపాటున గోల చేస్తే ఇంకెన్ని అక్రమాలు బయటకు తీస్తారో అనే వణుకు చంద్రబాబు నోటికి తాళం వేసిందని పేర్కొన్నారు.
ఇక మరో పోస్టులో షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి 118 కోట్ల రూపాయలు కమిషన్ గా తీసుకున్నట్టు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవేనని విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హవాలా ఆపరేటర్లు అందరూ చంద్రబాబు కనుసన్నలలోనే పనిచేస్తారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
పొరపాటున వాళ్ళు ఎవరైనా డబ్బుతో దొరికితే వ్యవస్థలలో తనకున్న పలుకుబడితో చంద్రబాబు విడిపిస్తాడు అని చెప్పుకొచ్చారు. మొత్తంగా చంద్రబాబు అవినీతి బండారం బయటపడుతుందని విజయసాయిరెడ్డి మరోమారు సోషల్ మీడియా వేదికగా బాబును టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications