ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ: తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారించింది. సుమారు నాలుగున్నర గంటలపాటు విచారణ కొనసాగింది.
సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరైనట్లు తెలిపారు. విచారణ పారదర్శకంగా సాగాలని సీబీఐని కోరినట్లు తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను తన సమాధానాలతో నివృత్తి చేసినట్లు తెలిపారు అవినాష్ రెడ్డి.
మళ్లీ విచారణకు ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని సీబీఐ అధికారులకు చెప్పినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో, ఆడియో అనుమతి కోరానని.. అయితే, అందుకు అధికారులు అంగీకరించలేదని తెలిపారు. విచారణకు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయిన అవినాష్ రెడ్డి మండిపడ్డారు.
కాగా, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగానే.. సీబీఐ బృందం అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి దాదాపు మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019 మార్చిలో వివేకా హత్య జరిగింది. దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది.