విహెచ్ బైఠాయింపు, బాబు అత్యవసర భేటీ, అందుకే దీక్ష.. చెప్తే ఇప్పుడే విరమిస్తా: ముద్రగడ
హైదరాబాద్/రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్షలో న్యాయం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శుక్రవారం అన్నారు. కేసులకు భయపడేది లేదని చెప్పారని గుర్తు చేశారు.
కాపులకు రిజర్వేషన్లతో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం అంటూనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను రెచ్చగొడుతున్నారన్నారు. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు విహెచ్ కిర్లంపూడి వెళ్లారు. పోలీసులు అతనిని అడ్డుకోవడంతో ఆయన నిరసనగా బైఠాయించారు. మరోవైపు, అమలాపురంలో ముద్రగడ దీక్షకు మద్దతుగా కొందరు కాపులు దీక్ష చేస్తున్నారు.
మరోవైపు, ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. మంత్రి గంటా శ్రీనివాస్, కాపు కార్పోరేషన్ చైర్మన్ రామాంజనేయులు తదితరులతో భేటీ అయ్యారు. టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వంలో ఉన్నందువల్లే రోడ్డెక్కడం లేదన్నారు. అయితే, కాపు అంశం ఉన్న పళంగా పరిష్కారం కాదని చెప్పారు.
కంచాలతో శబ్దం చేస్తూ ముద్రగడ దీక్షకు మద్దతు
ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా జిల్లాలోని పి గన్నవరం, జగ్గంపేట ప్రాంతాల్లో మహిళలు, గ్రామస్థులు రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలిపారు. చెంచాలతో కంచాలను కొట్టి శబ్దం చేస్తూ నిరసన తెలిపారు. మహిళల ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
సానుకూలత వస్తే విరమిస్తా: ముద్రగడ
నా జాతి ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తే తాను దీక్ష విరమిస్తానని చెప్పారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, శాంతియుతంగానే నిరసన తెలుపుతామని చెప్పారు.
తన ఆమరణ నిరాహార దీక్షకు దారి తీసిన కారణాలను ముద్రగడ వెల్లడించారు. తునిలో జరిగిన కాపు గర్జనలో పెచ్చరిల్లిన హింసకు సంబందించి తనపై ప్రభుత్వం 63 కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. కేసులకు భయపడి తాను గృహ నిర్బంధం విధించుకున్నాననే అపవాదు రాకూడదనే భావనతోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగానన్నారు.
అంతేకాక కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తే దీక్షకు దిగబోనని ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఈ క్రమంలో తనతో చర్చలకు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు తోట త్రిమూర్తులు, బోండా ఉమామహేశ్వర రావు, బొడ్డు భాస్కర రామారావులకు ఇదే విషయాన్ని చెప్పానని వెల్లడించారు.
కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న జస్టిస్ మంజునాథ కమిషన్ కాల పరిమితిని మూడు నెలలకు కుదించినా, తాను దీక్షకు దిగనని చెప్పానన్నారు. తన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని, గత్యంతరం లేక ఆమరణ దీక్షకు దిగినట్లు చెప్పపారు.
ప్రభుత్వం ప్రతినిధులతో చర్చించేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానన్నారు. ప్రభుత్వం మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తే, ఇప్పటికిప్పుడు దీక్ష విరమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముద్రగడ పద్మనాధం స్పష్టం చేశారు.