పవన్ కళ్యాణ్కు కౌంటర్గా తెరపైకి ముద్రగడ!: వంగవీటి రంగా హత్య.. బాబుకు చుక్కలు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చుక్కలు చూపిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన ఆదివారం తలపెట్టిన కాపు గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏకంగా కేరళలో తన షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ వచ్చారు. ఆయన తుని ఘటన పైన స్పందించేందుకే ప్రత్యేకంగా రావడం గమనార్హం. కాపు గర్జన, తుని ఘటన పైన టిడిపి, వైసిపి మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది.
ఇప్పటికే ముద్రగడ పద్మనాభం... చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. కాపులను దాదాపు ఏకం చేశారు. 2014 ఎన్నికల్లో కాపులు టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. తదుపరి ఏ ఎన్నికల్లోనైనా కాపు ఓట్లు చాలా కీలకం. ఈ నేపథ్యంలో వారి ఓటు బ్యాంకుని తమవైపు మళ్లించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ను టిడిపి - బిజెపి నేతలు ఉపయోగించుకుంటున్నారు. పలుమార్లు ప్రభుత్వంపై పవన్ ప్రశ్నించినప్పటికీ... అంతిమంగా ఆయన మద్దతు మాత్రం ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు కౌంటర్గా.. వైసిపి అధినేత జగన్.. కాపు నేత ముద్రగడను తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు. పవన్ కుల, మత రాజకీయాలకు దూరం.
పవన్ కళ్యాణ్కు ధీటైన నేతనా, కాదా అనే విషయం పక్కన పెడితే... ముద్రగడ కాపు గర్జన నేపథ్యంలో వైసిపి, కొందరు కాపు నేతలు, ముద్రగడ.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. 1988లో వంగవీటి రంగా హత్యను కూడా పదేపదే తెరపైకి తీసుకు వస్తూ... చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో కాపులు టిడిపి వైపు మళ్లిన నేపథ్యంలో వారిని తమ వైపుకు మళ్లించుకునేందుకు వైసిపి అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తదుపరి ఎన్నికల నాటికి కాపు ఓటు బ్యాంకును అన్ని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ కారణంగానే వంగవీటి రంగా పేరును వైసిపి నేతలు పదేపదే తెరపైకి తెస్తున్నారంటున్నారు. తాజాగా, జగన్ మాట్లాడుతూ... 1988లో కాపునాడు సభ విజయవాడలో జరిగిందని, అది విజయవంతం అవడం తట్టుకోలేని టిడిపి వాళ్లు వంగవీటి మోహన రంగాను హత్య చేశారని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని, స్వయంగా హరిరామ జోగయ్య పుస్తకంలో పేర్కొన్నారని ఆరోపించారు.
వంగవీటి రంగా హత్యలో ప్రమేయం ఉన్న వారు.. టిడిపిలో ఉన్నారని, అందులో ఒకరు సభాపతిగా (కోడెల), మరొకరి మంత్రిగా (దేవినేని), ఇంకొకరు విజయవాడ నుంచి వెళ్లి విశాఖలో ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణ అని ఆరోపించారు. నాడు వంగవీటి రంగా హత్య నేపథ్యంలో టిడిపి కాపు మద్దతును కోల్పోయి అధికారం కోల్పోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు చంద్రబాబుకు ముద్రగడ చుక్కలు చూపించడం గమనార్హం.