చంద్రబాబు నియంత.. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు: ముద్రగడ
కాపుల ఆకాంక్ష గొంతెమ్మ కోరిక కాదని, గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామినే నెరవేర్చమంటున్నామని అన్నారు.
విజయనగరం: కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని మరో దఫా ఉధృతం చేసే పనిలో పడ్డారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఇందుకోసం అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
తాజాగా కాపు రిజర్వేషన్ సాధన సమితి ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా శ్రీకాకుళం నేతలను ముద్రగడ పద్మనాభం కోరారు. శ్రీకాకుళంలో తొలుత స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న సమాధికి ముద్రగడ నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే గౌతు శివాజీ ఇంటికెళ్లి కాపు ఉద్యమానికి మద్దతునివ్వాల్సిందిగా కోరారు. గౌతు శివాజీ ఇంటినుంచి నేరుగా వడిశ బాలకృష్ణ ఇంటికి వెళ్లిన ముద్రగడ.. అక్కడ పలువురు బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. కాపుల ఆకాంక్ష గొంతెమ్మ కోరిక కాదని, గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామినే నెరవేర్చమంటున్నామని అన్నారు.
ఇచ్చిన హామి నెరవేర్చమని కోరుతుంటే చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాపు రిజర్వేష్ ఉద్యమానికి అందరు మద్దతునివ్వాల్సిందిగా కోరారు.