ముద్రగడ ఉద్యమం కొత్త మలుపు: కాపులంతా ఏకం అవుతారా?
హైదరాబాద్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముద్రగడ చేపట్టిన ఈ ఉద్యమం రాష్ట్రంలోని కాపులందరినీ ఏకం చేయనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో కాపులకు రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ముద్రగడ రొడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలోని కాపు నేతలందరిని కలిసి మద్దతు కోరుతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రికే హైదరాబాద్కు చేరుకున్న ముద్రగడ శనివారం ఉదయం పలువురు కీలక నేతలతో వరుసగా భేటీ అయ్యారు.
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలను కలిసిన ముద్రగడ ఆ తర్వాత దర్శకరత్న, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని దాసరి వద్ద ముద్రగడ ప్రస్తావించారు.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి... ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తానిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు.
మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాపు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమని చెప్పారు. దీంతో తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఆయన రఘువీరా రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న ముద్రగడకు తమ మద్దతు ఉంటుందని చిరంజీవి తెలిపారు.
ఆయన చేపట్టిన బృహత్ మహాకార్యానికి తామంతా అండగా ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపు ఉద్యమానికి సంబంధించిన అంశాలపై చిరంజీవితో ముద్రగడ చర్చించారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ చేస్తున్న పోరాటం ప్రశంసనీయమన్నారు.
ఇలా రాష్ట్రంలోని కాపు నేతలందరినీ ముద్రగడ ఒక్కొక్కరిగా కలుస్తూ తన ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. గత వారంలో రాష్ట్రంలోని కాపు నేతలందరితో విజయవాడలో సమావేశమైన ముద్రగడ చంద్రబాబుకు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
కాపు ఉద్యమంపై మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కల్పించింది చంద్రబాబేనని ముద్రగడ అన్నారు. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని, ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబును నిలదీశారు. తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని, ఏ కులానికీ తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
తాను నాలుగు రోజుల పాటు హైదరాబాద్లోనే ఉంటానని, కాపు ఉద్యమానికి మద్దతిచ్చే ప్రతి నేతను కలుస్తానని అన్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుుడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పీఠాన్ని ఎక్కడంలో కాపు ఓటర్లు కీలక పాత్ర పోషించారు.
కాపులకు పట్టుగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలు టీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు మంచివారని, వారి రుణం తీర్చుకోలేనని పలుమార్లు బహిరంగ సభల్లో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications