ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ: వైసీపీ నుండి ఆఫర్: బీజేపీ నేతల ఆహ్వానం...రూటెటు..!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రూటెటు. రాజకీయంగా ఆయన రీ ఎంట్రీకి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్..టీడీపీలో పని చేసిన ముద్రగడ మంత్రిగానూ వ్యవహరించారు. టీడీపీ హాయంలో కాపు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి..ప్రభుత్వం మీద ఆయన ఒత్తిడి తెచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీ అమలు చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఇక, ప్రస్తుతం ఆయన రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా ఆయనతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు
ఆయనతో వైసీపీ నేతలు టచ్ లో ఉండటంతో పాటుగా..పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఒక కీలక ఆఫర్ సైతం ఆయన ముందు ఉంచినట్లు ప్రచారం సాగింది. అయితే, తాజాగా ఆయనతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఆయనను బీజీపీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవటంతో..ముద్రగడను సైతం తమ పార్టీలోకి తీసుకోవటం ద్వారా కాపు వర్గంలో బలం పెంచుకోవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ముద్రగడ కు వైసీపీ ఆఫర్..
2019 ఎన్నికల్లో పక్కగా సామాజిక సమీకరణాల విషయంలో వ్యూహాత్మకంగా అమలు చేయటంతో.. వైసీపీ విజయం సాధించింది. ఇదే రకమైన సమీకరణాలను అమలు చేసి..మరింత బలోపేతం అయ్యే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు.
ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభతోనూ వైసీపీ నేతలు గతంలోనే మంతనలు సాగించి నట్లుగా ప్రచారం సాగింది. ముద్రగడ వైసీపీలో చేరితే ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. ఇక, ఇప్పుడు బీజేపీ..జనసేన పొత్తు పెట్టుకోవటం..వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని ప్రకటించటంతో..వైసీపీ అప్రమత్తమైంది. అందులో భాగంగానే ముద్రగడను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు గతంలోనే మొదలు పెట్టింది. ఇక, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.

బీజేపీలో రావాలంటూ ఆహ్వానం..
ఇక..ఇప్పటికే పవన్ తో జత కట్టిన బీజేపీ మరింత మంది నేతల మద్దతు కోసం అడుగులు వేస్తోంది. అందులో బాగంగా.. మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభంతో, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ అయ్యారు. వారి భేటీపై గోదావరి జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ, జనసేన పొత్తుపై ఇరువురూ చర్చలు జరిపినట్లు సమాచారం.
కాపు నాయకుడుగా కోస్తాంధ్రాలో పట్టున్న ముద్రగడ పార్టీలోకి వస్తే కోస్తాంధ్రాలో మరింత బలం పేరుగుతుందని బీజేపీ ఆలోచన . రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ అయిన తరువాత సోము వీర్రాజు, ముద్రగడతో భేటీ కావడం రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించటం తో పాటుగా..పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముద్రగడ టీడీపీలోకి వెళ్లే అవకాశం లేకపోవటంతో..ఇప్పుడు ముద్రగడ రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications