రాజంపేటకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
ఏపీ మీదుగా కొన్ని ప్రధానమైన రైళ్లు, దూరప్రాంతాలకు ప్రయాణించే రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ వాటిల్లో కొన్నింటికి మాత్రమే నామమాత్రపు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. మిగతా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వేశాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ( ఎన్డీయే) ప్రభుత్వాలే ఉండటంతో వినతిపత్రాలన్నింటికీ సులువుగా అంగీకారం లభిస్తోంది. తాజాగా మరో ప్రధానమైన దూర ప్రాంత రైలుకు ఏపీలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
పచ్చజెండా ఊపిన అశ్వనీ వైష్ణవ్
ముంబయి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి ముంబయి వరకు ప్రయాణించే జయంతి ఎక్స్ ప్రెస్ కు ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట స్టేషన్ లో కొత్తగా హాల్టింగ్ ఇచ్చారు. వాస్తవానికి కరోనాకు ముందు ఇక్కడ హాల్టింగ్ ఉండేది. కొవిడ్ తర్వాత దాన్ని ఎత్తేయడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీనిపై భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసి వినతి పత్రం అందజేయడంతో ఆయన పచ్చజెండా ఊపారు. వెంటనే అధికారులు ఉత్తర్వులు జారీచేశారు.

జయంతికి ముందు మరో రెండు రైళ్లకు
జయంతి ఎక్స్ ప్రెస్ కు ముందు కూడా మరో రెండు రైళ్లకు ఏపీలో హాల్టింగ్ ఇచ్చారు. 02121, 02122 జబల్పూర్-మధురై-జబల్పూర్ ఎక్స్ప్రెస్, 04717, 04718 తిరుపతి- జైపూర్-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఒంగోలులో నిలిపేందుకు అధికారులు అనుమతి జారీచేశారు. గత నెల నుంచి ఇవి ఒంగోలులో ఆగుతున్నాయి. దీనిపై స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రైల్వేశాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి అనుమతి సాధించుకున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నుంచి మార్కాపురం, గిద్దలూరు, నంద్యాలమీదుగా బెంగళూరుకు వందేభారత్ నడిపించాలని కోరుతూ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై త్వరలోనే సానుకూలంగా నిర్ణయం రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే విశాఖపట్నం నుంచి బెంగళూరుకు విజయవాడమీదుగా మరో రైలు నడిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications