మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్: ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నిలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.
మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. మార్చి 16న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మార్చి 23న ఎన్నికలు నిర్వహించి, 27న ఫలితాలను విడుదల చేయనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, 12 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. కోర్టుల కేసుల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
కాగా, రాష్ట్రంలో 104 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. వివిధ కారణాలరీత్యా 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికను వాయిదా వేశారు.
ఎన్నికలు వాయిదా పడిన మున్సిపాలిటీల వివరాలు:
శ్రీకాకుళం : ఆముదాలవలస, రాజాం
ప. గో : భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు
కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి
గుంటూరు : బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల, దాచేపల్లి
ప్రకాశం : కందుకూరు, దర్శి
నెల్లూరు : గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం
కడప : రాజంపేట, కమలాపురం
కర్నూలు : బేతంచర్ల
అనంతపురం : పామిడి, పెనుకొండ
చిత్తూరు : శ్రీకాళహస్తి, కుప్పం.












Click it and Unblock the Notifications