నేడే మున్సిపల్ ఓట్ల లెక్కింపు -మధ్నాహ్నానికి ఫలితాలు : హోరా హోరీ..!!
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్బంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయో స్పష్టం అయింది. ఇక, ఇప్పుడు జరిగే కౌంటింగ్ పైన అదే స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.
మధ్నాహ్నానికి ఫలితాల వెల్లడి
ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు.
టీడీపీ.. వైసీపీ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా
కౌంటింగ్ సూపర్వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్లు పోను మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని తెలిపారు.
నెల్లూరుతో సహా 12 మున్సిపాల్టీల్లో
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని.. రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు. మధ్నాహ్నానికి ఫలితాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Recommended Video
రాజకీయంగా ఉత్కంఠ.. బందోబస్తు
ఇక, నెల్లూరు కార్పోరేషన్ ..కుప్పం తో పాటుగా పల్నాడులో ని దాచేపల్లి..గురజాల మున్సిపాల్టీల ఫలితాల పైన పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార - ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. పోలింగ్ రోజు సైతం తమ అధిపత్యం నిరూపించు కొనే ప్రయత్నాలు సాగాయి. దీంతో.. ఫలితాల వెల్లడి సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలకు చోటు లేకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.