పన్ను కట్టలేదని ఇళ్లకు సీల్ - అధికారుల నిర్వాకంతో : వడ్డీ వ్యాపారుల తరహాలో..!!
తూర్పు గోదావరి జిల్లాలో అధికారుల తీరు విమర్శలకు కారణమవుతోంది. కాకినాడలో పన్ను ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టకపోతే ఇంట్లో సామగ్రి తీసుకుపోతామంటూ బ్యానర్లు కట్టి మరీ వాహనాలను వీధుల్లో తిప్పటం రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఏకంగా పన్ను చెల్లించని కారణంగా.. ఇంటికే సీల్ వేసిన తీరు పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పిఠాపురంలో మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆస్తిపన్ను కట్టనందుకు ఏకంగా రెండు ఇళ్లకు తాళాలు, సీలు వేసారు.
మున్సిపల్ సిబ్బంది అతి చర్యలు
మోహనగర్లో పన్ను వసూళ్లకు వెళ్లిన అధికారులు... అక్కడ గొర్రెల సత్తిబాబు, గొర్రెల రమణ ఆస్తిపన్ను చెల్లించలేదంటూ వారి ఇళ్లకు తాళాలు వేసి సీలు వేశారు. సత్తిబాబు ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు దీని పైన స్థానిక మహిళలు అధికారులను నిలదీసారు. తనకు ఎప్పుడూ ఇంటిపన్ను రూ.1,600 మాత్రమే వచ్చేదని, ఈసారి రూ.6,400 వచ్చిందని గొర్రెల సత్తిబాబు తెలిపారు. పన్ను చెల్లించేందుకు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని చెబుతున్నారు. దీంతో.. స్థానికులు, తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటికి వేసిన తాళం, సీల్ను సిబ్బంది తొలగించారు.
టీడీపీ - స్థానికుల ఆందోళన
రమణ ఇంటికి మాత్రం నిన్న సాయంత్రం నుంచి తాళం, సీల్ అలాగే ఉంచారు. మునిసిపల్ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి వర్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. మోహననగర్ ప్రాంతానికి అసలు తాగునీరే సరఫరా కావట్లేదని, అలాంటప్పుడు కుళాయి పన్ను ఎందుకు చెల్లించాలని నిలదీశారు.
పన్ను చెల్లించలేదని ఇళ్లకు సీలువేసే అధికారం మున్సిపల్ అధికారులకు ఎవరిచ్చారని వర్మ నిలదీసారు. కాకినాడలో పన్ను వసూలు కోసం వాహనాలు తిప్పటం.. కర్నూలులో చెత్త పన్ను చెల్లించలేదని.. కార్పొరేషన్ అధికారులు షాపుల ముందు చెత్త వేశారు. తాము ఆస్తి, నీటి పన్ను, దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుము చెల్లిస్తున్నామని దుకాణాదారులు చెప్పారు.
చెత్త పన్ను విషయంలోనూ నిరసనలు
మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. దీంతో..నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్లో తీసుకొచ్చి దుకాణాల ముందు పడేసి వెళ్లారు. ఈ ఘటనతో సంబంధిత దుకాణాల యజమానులు అవాక్కయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి విచిత్రమైన పన్నులు వసూలు చేస్తున్నారని వాపోయారు.
ఇలా.. ఈ రకమైన పన్నుల పేరుతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని డామేజ్ గా మారుతోంది. అధికారుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఇలా..వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల పైన ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.