సాక్ష్యం లేక ఏడుగురి హత్య కేసులో మరణశిక్ష రద్దు
హైదరాబాద్: తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఏడుగురిని హత్య చేసిన కేసులో సిర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ శంకరరావు విముక్తి పొందాడు. తన ఇద్దరు పిల్లల హత్యకేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఐదుగురిని అతను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని విశాఖపట్నంలోని ఓ ఆశ్రమంలో ఉంచాలని హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది.
కీలకమైన సాక్ష్యుల సాక్ష్యాలను నమోదు చేయకపోవడం కేసును బలహీనపరిచిందని, అత్యంత కిరాతకమైన నేరాల విషయంలో కూడా చాలాసార్లు ఇలా జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిందిడుతు శంకర్రావుకు శ్రీకాకుళం జిల్లా సెషన్స్ కోర్టు 2012లో మరణశిక్ష విధించింది. అతను దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు.
ఈ కేసు ప్రాసిక్యూషన్ విచారణలో పలు మిస్సింగ్ లింకులున్నాయని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్లతో కూడిన హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మారమూల గ్రామం మెట్టపేటకు చెందిన శంకరరావు 2010 నవంబర్ 30వ తేదీనతన ఇద్దరు పిల్లలను చంపాడని, ఆ తర్వాత పైలా వెంకటి, బొడ్డేపల్లి దమయంతి, వూట పార్వతి, పైలా లక్ష్మణ్, మెట్ట ఎర్రయ్యలను నరికి చంపినట్లు ఆరోపణలు చ్చాయి.
అంతకు ముందు భార్య హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చినందుకు శంకరరావు ఆ ఐదుగురిని చంపినట్లు అభియోగాలు మోపారు. గ్రామంలో భయాందోళనలు సృష్టించడానికి బాంబులు కూడా విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి.