రోడ్డున పడేయొద్దు: విశాఖలో మంత్రి గంటాకు నిరసన సెగ
అమరావతి: నగరంలోని హనుమంతవాక మేకల కబేళాను మారికవలసకు తరలించి, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ మాంసం వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట మాంసం వ్యాపారులు పెద్దఎత్తున తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విశాఖ మటన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు అప్పారావు మాట్లాడుతూ కబేళాను నగరానికి 40 కి.మి. దూరాన ఉన్న మారిక వలసకు మార్చటంతో రెండు గంటల సమయం పడుతోందని అన్నారు. ఇలా చేయడం వల్ల అర్థరాత్రి సమయంలో తామంతా కబేళాకు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.
మాంసం వ్యాపారంపై ఆధారపడి సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ఈ క్రమంలో కబేళాను తరలించటం ద్వారా చాలా మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హనుమంతవాక వద్ద సుమారు 33 సంవత్సరాలుగా కబేళా నిర్వహిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కబేళాను తెరిచి, వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా మాంసం వ్యాపారులు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి గంటాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి జీవీఎంసీ కమిషనర్తో చర్చిస్తానని హామీ ఇచ్చారు.