చంద్రబాబుతో భేటీ తర్వాత మెత్తబడ్డ గోరంట్ల: రాజీనామాపై తగ్గిన బుచ్చయ్య చౌదరి, ఏమన్నారంటే?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అలకను వీడారు. తాను తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంటల్ బుచ్చయ్య చౌదరి చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
సుమారు 40 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
పార్టీలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, ఆ మాట వాస్తవమేనని చెప్పారు బుచ్చయ్య చౌదరి, అయితే, ఎంతో మంది మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరినట్లు తెలిపారు. పార్టీకి సంబంధించి తన అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. కార్యకర్త మనోభావాలను టీడీపీ అధినేతకు వివరించినట్లు ఆయన వెల్లడించారు.
స్థానిక ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనిట్లు ఆయన తెలిపారు. ఎవరినీ బెదిరించడానికో.. పదవుల కోసం తాను అసంతృప్తి వ్యక్తం చేయలేదని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. పార్టీ కోసమే తన తపన అని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగాలని బుచ్చయ్య అన్నారు. పార్టీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటాం.. సరిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. ఉన్నంత కాలం పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు బుచ్చయ్య చౌదరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల టీడీపీ వీడతారంటూ, రాజీనామా చేస్తారంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ నేతలో చోటు చేసుకున్న విభేదాల కారణంగానే టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు గోరంట్ల సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, రెండు మూడు రోజులపాటు ఎవరితోనూ మాట్లాడని బుచ్చయ్య చౌదరి.. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన వద్ద సమస్యలను చెప్పుకున్నారు. అన్నింటికీ సానుకూల స్పందన రావడంతో బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.