సింపతీ ఉండవచ్చు, తప్పు చేయలేదు: టెక్కీ తండ్రి
హైదరాబాద్: తమ కుమారుడు ఏ విధమైన తప్పు చేయలేదని టెక్కీ సల్మాన్ మొయినుద్దీన్ తండ్రి అహ్మద్ మొయినుద్దీన్ అన్నారు. ఇస్లామిక్ స్టేట్లో చేరడానికి దుబాయ్ వెళ్తున్నాడనే ఆరోపణపై సల్మాన్ మొయినుద్దీన్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ తండ్రి అహ్మద్ మొయినుద్దీ్ రిటైర్డ్ ఇంజనీర్.
ఆలోచనకు, ఆచరణకు మధ్య తేడా ఉంటుందని, తన కుమారుడికి కొన్ని గ్రూపుల పట్ల సానుభూతి ఉండవచ్చు గానీ ఏ తప్పు చేయలేదని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యమేదీ తన కుమారుడు చేయలేదని ఆయన అన్నారు. ల్యాప్టాప్ రాతల్లో కొన్ని గ్రూపుల పట్ల తన కుమారుడికి కొంత సానుభూతి ఉన్నట్లు తేలవచ్చునని, దాన్ని తాను కాదనడం లేదని ఆయన అన్నారు.

కానీ రాజకీయాల గురించి తాను తన కుమారుడితో ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు దుబాయ్కి మీ కుమారుడు ఎందుకు వెళ్తున్నాడని అడిగితే, అమెరికాకు ఫ్యామిలీ వీసా లభించకపోవడంతో ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్తున్నాడని అహ్మద్ మొయినుద్దీన్ సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో పుట్టి, పెరిగి అమెరికాలో ఉన్నత చదువులు చదివిన ఓ ఇంజనీర్ సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లోకి చేరేందుకు బయల్దేరి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్కు చేరుకుని అక్కడి నుంచి తన గర్ల్ఫ్రెండ్తో సహా టర్కీ మీదుగా సిరియా చెక్కేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన అతడిని ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.
అతని వద్ద నుంచి లాప్టాప్, రెండు సెల్ఫోన్లు, పాస్పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సామాజిక వెబ్సైట్ల ద్వారా ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనుకూల ప్రచారం చేస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టడంతో అతడి ప్రణాళికలు బయటపడ్డాయి. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైదరాబాద్లోని బజార్ఘట్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ (32) బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ టెక్సాస్లోని ఓ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications