ఏపీలో అధికారంలోకి జగన్: మైసూరా వ్యాఖ్యలే నిజమవుతాయా?
అమరావతి: 'మరో ఏడాదో, రెండేళ్లు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. మీ కష్టాలు తీరతాయి' ఏపీలో పలు బహిరంగ సభల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ఇది. అయితే ఆయన మాటాలు ఇప్పుడు సత్యదూరమనే చెప్పొచ్చు.
ఎందుకంటే బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మైసూరా రెడ్డి ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లోనైనా జగన్ అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించగా అందుకు జగన్కు అధికారం అందడం దాదాపుగా అసాధ్యమేనని తేల్చేశారు.
ఒకవేళ జగన్ ఏపీలో అధికారంలోకి రావాలంటే పరిస్థితులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆయన కాస్తంత విపులంగానే చెప్పారు. మైసూరా అంచనా ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలం కావడం. అదే సమయంలో రాజకీయంగా ఇతర పక్షాలు బలీయం కావడం లాంటివి జరగడం.
ఏపీలో ఇలాంటి పరిస్థితులు లేకపోతే జగన్ అధికారంంలోకి రావడం కలేనని మైసూరా తేల్చేశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టారు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీని చంద్రబాబు ప్రభుత్వం సరిగా అమలు చేయలేక పోయినా ఫించన్లు, ఎన్టీఆర్ వైద్యం లాంటి సంక్షేమ పథకాలు మాత్రం బాగానే కొనసాగిస్తున్నారని ప్రజల్లో వాదన ఉంది. మరోవైపు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.
ఇప్పట్లో ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం కూడా ఆ పార్టీ నేతల్లో కలగడం లేదు. మరోవైపు ఏపీలో అధికార పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'కు వైసీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.
ఈ క్రమంలో అటు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా, వైసీపీ సంఖ్యాబలం తగ్గుతోంది. మరో ఏడుగురు వరకు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పలుమార్లు మీడియాలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు వచ్చే వరకు వైయస్ జగన్కు అధికారం అందడం కష్టమే.