ప్రమాదం కాదు, గౌతమిని వెంటాడి చంపారు!: టీడీపీ నేత మొదటి భార్య పనే?
పాలకొల్లు మండలం దిగమర్రు వద్ద గత బుధవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందిన నరసాపురానికి చెందిన దంగేటి శ్రీగౌతమి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లు మండలం దిగమర్రు వద్ద గత బుధవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందిన నరసాపురానికి చెందిన విద్యార్థిని దంగేటి శ్రీగౌతమి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను కొందరు కావాలనే వెంటాడి చంపేసినట్లు తెలుస్తోంది.
కాగా, గౌతమితోపాటు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు పావని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత ఇంటి వద్ద ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. తన అక్కకు నరసాపురం మండలానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారితో ఏడాది క్రితం వివాహమైందని పేర్కొంది. అతని మొదటి భార్య ఈ విషయమై ఇప్పటికే తన అక్క గౌతమిని పలుమార్లు బెదిరించిందని పావని చెప్పింది.

సంఘటనపై పావని మాటల్లోనే.. 'బుధవారం సాయంత్రం నేనూ, అక్క పాలకొల్లు ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాం. పాలకొల్లు దాటిన తర్వాత కొందరు కారులో వెంబడించారు. కారులోంచి కొందరు నా చున్నీ పట్టుకుని లాగేందుకు యత్నించారు. తేరుకునే లోపే మా స్కూటర్ను కారుతో ఢీకొట్టారు. దీంతో నేను కారుపై పడ్డాను. నన్ను కొంతదూరం ఈడ్చుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు' అని తెలిపింది.
'స్థానిక టీడీపీ నేత సజ్జా బుజ్జితో అక్కకు చాలాకాలంగా పరిచయం ఉంది. 2016 జనవరిలో అక్కను బుజ్జి పెళ్లిచేసుకున్నాడు. అతడికి అంతకు ముందే శిరీషతో పెళ్లయింది. ఆమెతో తనకు పడటం లేదని, త్వరలోనే విడాకులు ఇచ్చేస్తానని బుజ్జి అక్కకు చెప్పేవాడు. బుజ్జి భార్య.. అక్కను రోజూ వేధించేది. చంపేస్తానని ఫోన్లో బెదిరించేది. శిరీషే ఈ హత్య చేయించింది. కారులో నలుగురో, ఐదుగురో ఉన్నారు. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అనడం అబద్ధం. బుజ్జి, అక్క కలిసి ఉన్న ఫొటోలు, ఆసుపత్రి బిల్లులు పోలీసులు తీసుకువెళ్లారు' అని వెల్లడించింది.
తన కూతురు శ్రీగౌతమి మృతిపై తల్లి టి అనంతలక్ష్మి మాట్లాడుతూ..
'నా కుమార్తెను కిరాతకంగా చంపేశారు. మా ఆయన చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్నాను. శ్రీగౌతమి పెద్దకొడుకుగా ఉండేది. సివిల్స్కు ప్రిపేరవుతోంది. శిరీష వాళ్ల ఆయనకు మా అమ్మాయితో సంబంధం ఉంటే నాతోటో, పెద్దలతోనో చెప్పొచ్చు. లేదంటే పోలీసు కేసు పెట్టవచ్చు, కోర్టుకు వెళ్లొచ్చు. ఏకంగా చంపించేస్తారా? కచ్చితంగా శిరీషే ఈ హత్య చేయించింది. మా కుటుంబానికి న్యాయం జరగాలి' అని ఆమె కోరారు.
ఇది ఇలా ఉండగా, దిగమర్రు ఘటనలో యువతి మృతితోపాటు మరో యువతికి గాయాలైన కేసుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, పాలకొల్లు రూరల్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. స్కూటర్ను ఢీకొన్న వాహనం విశాఖపట్నంకు చెందినదిగా దర్యాప్తులో తేలిందని, కారు యజమాని సందీప్ వివరాలు సేకరించామన్నారు.
అతన్ని పట్టుకునేందుకు గ్రామీణ ఎస్ఐ, కానిస్టేబుల్ విశాఖపట్నం వెళ్లారని, అతను ఇంటికి రాకపోవడంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ప్రమాద ఘటనపై యువతి పావని చెబుతున్న సమాచారం మేరకు ఆ దిశగానూ దర్యాప్తు చేస్తామని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications