పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు: కేంద్రానికి బాబు ఝలక్, ఒత్తిడి వ్యూహం
ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంచార్జ్ డీజీపీగా ఉన్న ఆయన మరో నెల రోజుల్లో రిటైర్ కానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంచార్జ్ డీజీపీగా ఉన్న ఆయన మరో నెల రోజుల్లో రిటైర్ కానున్నారు.
సాంబశివరావు పదవీకాలం పొడిగించే అవకాశం
అయితే ఇంచార్జ్ డీజీపీగా రిటైర్ అవడం సమంజసం కాదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, ఆయన పదవీ కాలాన్ని కూడా పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
కేంద్రంపై ఒత్తిడి కోసం కూడా
ఇంచార్జిగా ఉన్న సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా చేయడం వెనుక కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగం కూడా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంబశివ రావు ఇంచార్జిగా తన సామర్థ్యం నిరూపించుకున్నారని చెబుతున్నారు.
సాంబశివరావు పేరును కేంద్రానికి పంపినా నో
సాంబశివరావు పేరు సహా కొంతమంది పేర్లను కేంద్రానికి గతంలోనే పంపించారు. అయితే యూపీఎస్సీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తిరస్కరణ వెనుక ఏపీకి చెందిన కొందరు అధికారులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. వారికి క్లాస్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో పంపిన దానిని కేంద్రం తిరస్కరించింది. ఈసారి పంపితే ఆమోదించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా చెప్పారు. తద్వారా కేంద్రాన్ని ఒత్తిడిలోకి నెట్టే వ్యూహం అని అంటున్నారు.
సాంబశివరావు పనితీరుపై పూర్తి సంతృప్తి
కాగా, సాంబశివ రావు పనితీరుపై చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తితో ఉంది. తుని ఘటన, జగన్ పాదయాత్ర, ముద్రగడ పద్మనాభం నిరసనలు వంటి అంశాలలో ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత ఉండకుండా సాంబశివరావు మేనేజ్మెంట్ విధానం బాగుందని భావిస్తున్నారు. ఆ కారణంగానే ఆయన పేరును కేంద్రానికి పంపిస్తే తిరస్కరించారు. యూపీఎస్సీని తోసిరాజని ఆయనకు బాధ్యతలు అప్పగించారు.