నివేదిక ఎలా బయటకు వచ్చింది?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై జనసేన వర్గాలు దాడి చేస్తాయంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ తట్టుకోలేక ఇలాంటి కుట్రలు చేయడం, డ్రామాలాడటం చేస్తోందని మండిపడ్డారు. డీజీపీ కార్యాలయ వర్గాల నివేదిక ఆధారంగా మీడియా వార్తలు ఇస్తోందని, రహస్యంగా ఉంచాల్సిన నివేదిక బయటకు ఎలా వచ్చిందో డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రహస్య నివేదిక లీక్ కావడంపై డీజీపీ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. జనసేన నాయకుల ఫోన్లపై నిఘా ఉంచడం కాకుండా ఇలాంటి వ్యవహారాలపై కూడా నిఘా ఉంచాలని డీజీపీకి వ్యంగ్యాస్త్రం విసిరారు.
విశాఖపట్నం ఘటన ప్రభుత్వమే కావాలని చేసిన కుట్ర అని, అది అందరికీ తెలిసిన విషయమేనని మనోహర్ ఆరోపించారు. టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులను వైసీపీ తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగానే వైసీపీతో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొద్దిరోజులుగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకోవడం, పోలీసులు నోటీసులివ్వడంతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న జనసేనాని వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన చెప్పు చూపిస్తూ మండిపడ్డారు. వెంటనే విజయవాడలో బస చేసిన పవన్ ను చంద్రబాబు కలిసి సంఘీభావం తెలియజేశారు. ఈ కలయిక రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగడానికి కారణమవుతోందని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడ్డారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులపై జనసేన శ్రేణులు దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో డీజీపీ వారికి భద్రతను పెంచారు. జరుగుతున్న ప్రచారంపై మనోహర్ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications