అప్పుడు మంత్రులుగా పట్టించుకోలేదే ? ధర్మాన ప్రత్యేక రాష్ట్రం కామెంట్స్ కు నాదెండ్ల కౌంటర్..
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన డిమాండ్ పై జనసేన పీఎసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో జరుగుతున్న జనసేన యువశక్తి సభలో మాట్లాడిన నాదెండ్ల.. ధర్మాన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని స్ధానిక మంత్రి అడుగుతున్నారని, కానీ 20, 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ, గొప్ప గొప్పశాఖలకు మంత్రులుగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని నాదెండ్ల ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను వారు అప్పుడు అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఈ డిమాండ్లు చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ వైసీపీ సర్కార్ సంక్షేమం, రాజధాని పేరుతో మోసం చేస్తోందని నాదెండ్ల విమర్శించారు. ఈ సందర్భంగా వివిధ పథకాల పేరుతో వైసీపీ చేస్తున్న మోసాన్ని ఆయన వివరించారు.
వైసీపీ మత్సకార భరోసా పేరుతో మోసం చేస్తోందని, వైసీపీ జెండా మోసినోళ్లకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏ గ్రామానికెళ్లినా మత్సకార భరోసా కింద కేవలం 30 శాతం మందికే ఇచ్చారన్నారు. తాడేపల్లిలో కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమం జరిగిపోతుందంటున్నారని, జాబ్ క్యాలెండర్ ఏదీ అని అడిగారు. ఎక్కడైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందా అని నిలదీశారు. ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న వారు.. జగనన్న కాలనీల్లో చేసిన మోసాన్ని జనసేన పార్టీ బయటపెట్టిన విషయాన్ని నాదెండ్ల గుర్తుచేశారు.