పొత్తుల పై జనసేన కీలక ప్రకటన - టీడీపీ నెక్స్ట్ స్టెప్..!!
ఏపీలో పొత్తుల పై జనసేన కీలక ప్రకటన చేసింది. జనసేన ఎవరితో పొత్తుతో ఎన్నికలకు వెళ్తుందనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు కారణమైంది. ఈ అంశం పైన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దాదాపుగా పొత్తుల అంశం పైన స్పష్టత ఇచ్చారు. ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో ప్రధాని టూర్ మొత్తం సమీకరణాలనే మార్చేసింది. ఆ తరువాత టీడీపీ - జనసేన పొత్తు ఉంటుందా ..ఉండదా అనే చర్చ మొదలైంది. ఈ డైలమా నడుమ నాదెండ్ల మనోహర్ పొత్తులపైన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని స్పష్టం చేసాయి.

పొత్తులుంటే ధైర్యంగా చెబుతాం..
జనసేన ఎవరితో పొత్తుతో ముందుకెళ్తుందనే దాని పైన నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. జనసేన పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందని మనోహర్ వివరించారు. కొన్ని పార్టీలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతోందని వివరించారు. దీంతో, రెండు పార్టీలకు భయం పట్టుందని వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర పైన వైసీపీ నేతలు కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో సాగు-తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మనోహర్ తమ పార్టీ బలం పెంచుకోవటం పైన రెండు పార్టీలకు భయం పట్టుకుందంటూ పరోక్షంగా వైసీపీ - టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా స్పష్టం అవుతున్నాయి. వైసీపీతో పోరాటం చేస్తున్న జనసేన..అదే సమయంలో టీడీపీతో పొత్తు అంశాన్ని దాదాపుగా పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా...
విజయవాడలో పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా కలవటంతో పొత్తు ఖాయమనే ప్రచారం మొదలైంది. అయితే, ప్రధానితో విశాఖలో పవన్ పర్యటన తరువాత మొత్తంగా రాజకీయం మారి పోయింది. ప్రధానితో భేటీ తరువాత ఇక జనసేన - బీజేపీ పొత్తు కొనసాగుతుందని కమలం పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అదే సమయంలో..టీడీపీతో ఇక పవన్ కలవరని స్పష్టం చేస్తున్నారు. ఇక, చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు పొత్తుల వ్యవహారం పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఈ ఎన్నికల్లో గెలిస్తే సరే, లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఏపీకి ఇవే చివరి ఎన్నికలని..టీడీపీ గెలుపు రాష్ట్రానికి అవసరమంటూ చెప్పుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో పవన్ కల్యాణ్ స్వరంలోనూ మార్పు కనిపించింది. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ కల్యాన్ కోరారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ సైతం పాత్తులు ఉంటే ధైర్యంగా పవన్ చెబుతారంటూ చేసిన వ్యాఖ్యలతో పొత్తు డౌటుగానే కనిపిస్తోందనే చర్చ మొదలైంది.

వాస్తవం చెప్పారా..వ్యూహాత్మకంగా
ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపైన విశ్లేషణలు మొదలయ్యాయి. జనసేన బలంగా ఎదుగుతోందనే నమ్మకం ఆయన మాటల్లో కనిపిస్తోంది. తమ బలం పెంచుకుంటూ ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకొనే ఆలోచనలో ఉన్నారా..లేక, బీజేపీతోనే కొనసాగే క్రమంలో ఆ రెండు పార్టీలంటూ వైసీపీ - టీడీపీ ని టార్గెట్ చేసారా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో అటు టీడీపీ నేతలను పొత్తుల పైన స్పందించవద్దంటూ అధినాయకత్వం స్పష్టం చేసింది.
వచ్చే వారం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధానితో ప్రత్యేకంగా భేటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భేటీ జరిగితే పొత్తుల ప్రక్రియలో కొత్త మలుపులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. జనసేన అధినేత స్వయంగా పొత్తులపైన స్పష్టత ఇచ్చే వరకూ అటు జనసేన - ఇటు బీజేపీతో రాజకీయంగా వైరం అవసరం లేదని టీడీపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications