పవన్ కల్యాణ్ పై నాగబాబు ఎమోషనల్
నేరపూరిత రాజకీయాలకు బలవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలికిన మాట తనకు చాలా కష్టంగా అనిపించిందని ఆయన సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తమ నాయకుడే బలి కావాల్సి వస్తే.. మొదట బలయ్యేది తానేనని, పవన్ను ఏమైనా చేయాలంటే ముందుగా తనను దాటి వెళ్లాల్సి ఉంటుందని నాగబాబు వైసీపీ శ్రేణులను హెచ్చరించారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, పవన్ కళ్యాణ్ మచ్చలేని నాయకుడన్నారు. గతంలో సీఎం జగన్ తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భావోద్వేగంతో మాట తూలారని అన్నారని, అలాంటప్పుడు ఎదుటి పార్టీల వారికి భావోద్వేగాలు ఉండవా? అని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టని పోలీసులు జనసేన నాయకులు, కార్యకర్తలపై ఎందుకు పెట్టారని నిలదీశారు. మంత్రులపై దాడిచేయకుండా 307 సెక్షన్ కింద కేసులు ఎలా పెడతారన్నారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరిగిన కుట్రేనని నాగబాబు ఆరోపించారు. దాడిలో పవన్ కల్యాణ్ పాత్ర చూపించేటట్లుగా ప్రయత్నాలు చేశారన్నారు.
పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన ఉద్రిక్తంగా సాగిన సంగతి తెలిసిందే. నోటీసులివ్వడంతో తన పర్యటనను అర్థంతరంగా రద్దుచేసుకొని మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మీడియాతోపాటు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ విధానాలను దుయ్యబట్టారు. తర్వాత విజయవాడ హోటల్ లో బసచేయగా, అక్కడికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేరుకొని సంఘీభావం తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటవుతామని, ఎన్నికల్లో పోటీచేసే సంగతి ఆ తర్వాత ఆలోచిస్తామని, రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దడమే రాజకీయ పార్టీల అధినేతలుగా తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు అన్నారు.