డబ్బు ఉండటం కాదు.. తీయాలి, రూ.60 కోట్లు సంపాదించి పెడతానని.. ఇది జగన్ మాట: నాగబాబు షాకింగ్
అమరావతి/హైదరాబాద్: మెగా సోదరుడు నాగబాబు ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా టీడీపీ, వైసీపీలపై సెటైర్లు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో ప్రారంభంలోనే.. 'అటుచూడూ' అంటూ చెబుతూ జగన్కు సంబంధించిన ఓ వీడియోను చూపించారు. అందులో ఇలా ఉంది.
పెద్ద దొంగ.. చిన్న దొంగ, బాబును చూసి జగన్కు అసూయ: ఎందుకో చెప్పిన నాగబాబు
డబ్బు ఉండటం కాదు.. తీయాలి
'రాజకీయం అంటే డబ్బు కుమ్మరించడం, ఓట్లను కొనడం, గెలిచాక దోచుకోవడం, ఇదే జగన్ పద్ధతి, అదే పద్ధతి ఈయన పార్టీలో చేరేవాళ్లది కూడా' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్తో ఓ నాయకుడు మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అందులో షాకింగ్ కామెంట్స్ ఉన్నాయి. సదరు నేత, జగన్ మధ్య సంభాషణ ఉన్నట్లుగా ఉంది. 'మనోడు డబ్బున్నోడే సర్, పర్లేదు సర్ తీసుకోండి సర్' అని ఓ నాయకుడు చెబితే, 'ఉందీ.. కానీ తియ్యాలా' అని జగన్ అన్నట్లుగా ఉంది. దానికి సదరు నేత.. 'తీస్తాడు సర్.. తీస్తాడు' అని చెబుతారు.
జగన్ ఇలా చెప్పారు
ఆ తర్వాత 'అటు చూడు బే' అని భాషా సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో నాగబాబు చెబుతారు. అందులో... 'మీరు ఇవాళ ఏది అయితే వస్తుందని అనుకుంటున్నారో, అది మీరు ఏది అయితే నష్టపోతామని అనుకుంటున్నారో.. ఇంకా రెండేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిద్ది అనుకున్నది నాలుగింతలు వచ్చేట్టుగా చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టి రెండేళ్లు ఆగితే మన ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత మన ప్లేట్లోనే మన బిర్యాని మనమూ తినొచ్చు-జగన్' అని పేర్కొన్నారు.
డబ్బు తీయాలి.. జగన్ చాలా స్ట్రాంగ్
ఆ తర్వాత నాగబాబు తన మాటల దాడి ప్రారంభించారు. 'ఒరేయ్.. ఎవడు ఎటు చూసినా మన జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చే ఎన్నికల్లో గెలిచి, మన ఏపీని బిర్యానీ ప్లేట్లా చేసుకొని, బిర్యానీలా తినేద్దామని ప్లాన్ చేశారు.. ఆయనే కాదు, ఆయన ముఖ్యమైన అనుచరులు కూడా' అని పేర్కొన్నారు. ఒక వీడియోలో డబ్బులు తీయాలని చెబుతారని, కానీ ఎన్నికల సంఘం డబ్బు ఖర్చుకు ఓ పరిధి ఇచ్చిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీగా అనేవాడు ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టుకోగలడని చెప్పారు. కాబట్టి డబ్బు తీయాలి.. అంటే జగన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు.
జగన్ చాలా క్లారిటీగా ఉన్నారు
మరో వీడియోలో రెండేళ్లు ఓపిక పట్టండి, మన రాజ్యం వస్తుందని, మీకు పోయిన దానికి నాలుగింతలు సంపాదించి పెట్టే పూచీ తనది అని చెప్పారని, దీనికి అర్థం ఏమిటో చెప్పాలని నాగబాబు ప్రశ్నించారు. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో ఒకరు రూ.5 కోట్లు ఖర్చు పెట్టి పోయిందనుకుంటే, ఇప్పుడు మరో రూ.ఐదు పది కోట్లు ఖర్చు పెడితే.. అంటే మొత్తం రూ.15 కోట్లు అవుతుందని, దీనికి నాలుగింతలు అంటే రూ.60 నుంచి రూ.75 కోట్లు సంపాదించి పెడతానని ఆయన చెబుతున్నారన్నారు. మీరు బాగా ఖర్చుపెట్టండి.. గెలిచాక ఏపీని మనమంతా బిర్యానీ ప్లేట్లా చేసుకొని, మన బిర్యానీని మనమే తిందామని చెప్పారంటే ఏమి క్లారిటీ ఉన్న నాయకుడో అర్థమవుతోందన్నారు. జగన్ చాలా క్లారిటీగా ఉన్నారని, ఇంత విజన్ ఉన్న నాయకుడు దేశంలో మనకు ఎక్కడా దొరకడన్నారు. ఆయన విజన్ ఎక్స్ట్రా ఆర్డినరీ అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల పట్ల జగన్కు ఉన్న విజన్ ఇదీ అని నాగబాబు పేర్కొన్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకు కావాలా లేక ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలా అని తేల్చుకోవాలన్నారు.