కేసీఆర్ తెలంగాణకోసం కాదు: నాగం, షాతో ప్రముఖులు
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమం చేసింది పార్టీని బలోపేతం చేసుకోవడానికే కానీ తెలంగాణ కోసం కాదని భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మద్దతివ్వకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చేదని ఆయన ప్రశ్నించారు. తాను 1969లోనే ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు.
కేసీఆర్ తాను ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేస్తారో చూద్దామన్నారు. బీజేపీకి గ్రామస్థాయిలో బలం లేకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. తెలంగాణ కోసం బీజేపీ చేసిన కృషిని జనంలోకి సరిగా తీసుకు వెళ్లలేకపోయామన్నారు. అమిత్ షా నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పోరాటం చేస్తాం: దత్తాత్రేయ
కొత్త ప్రభుత్వం పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. కరెంట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రుణమాఫీపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. రెండు నెలల్లో 55 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మజ్లిస్తో దోస్తీ చేసి మతతత్వం పెంచే ప్రయత్నాలు చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పంచపాండవులం: కిషన్ రెడ్డి
తెలంగాణ శాసనసభలో తాము (బీజేపీ ఎమ్మెల్యేలు) పంచ పాండవులమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం ఆనాడు పంచ పాండవులు ఎలా పోరాడారో, అదే విధంగా ఈనాడు తెలంగాణ రక్షణ కోసం తాము అలా పోరాడతామన్నారు.
అమిత్షాతో తెలంగాణ లాయర్ల జేఏసీ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తెలంగాణ లాయర్ల జేఏసీ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. హైకోర్టు విభజనకు చొరవ తీసుకోవాలని ఈసందర్భంగా ఆయనకు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాదు అమీర్ పేటలోని మారీగోల్డ్ హోటల్లో అమిత్ షాతో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కామినేని శ్రీనివాస్, విద్యాసాగర్ రావు, సినీ నిర్మాత అశ్వినీ దత్, డాక్టర్ రమేష్, డాక్టర్ వినోద్, శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.