అధ్వాన్నంగా ఉన్న హైవేకి టోల్ ఛార్జీలా? రోడ్ మెయింటెనెన్స్ కూడా లేదని ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు విజయవాడలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిసి జాతీయ రహదారి పరిస్థితిని వివరించారు. జాతీయ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉందని ఆ రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదంటూ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు రోజా వినతి పత్రం
రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు కు వినతి పత్రం అందజేసిన రోజా తన నియోజకవర్గమైన నగరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని, వెంటనే ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.జాతీయ రహదారిలో నిబంధనల మేరకు పనులు జరగలేదని ఎమ్మెల్యే రోజా రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సాధారణ నిర్వహణ పనులు కూడా చేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా టోల్ వసూళ్లు చేస్తున్నారన్న రోజా
గతుకులమయమైన రోడ్డులో వాహనాలు ప్రయాణించడం కష్టంగా ఉందని, దీనివల్ల వాహనాలు దెబ్బతింటూ, ప్రతిరోజూ ఆక్సిడెంట్ లు అవుతున్నా నేషనల్ హైవే అథారిటీ వారు పట్టించుకోవటం లేదని, టోల్ సొమ్ముని మాత్రం యధావిధిగా వసూలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు హైవే అథారిటీ నిబందనల మేరకు ఇక్కడ నిర్మాణం జరగలేదని, మెయింటనెన్స్ కూడా చేయకపోవడం వల్ల పిచ్చిమొక్కలు, చెట్లతో రోడ్డు అద్వాన్నంగా ఉందని రోజా రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించి రోడ్డుని బాగుచేయించాలని, పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్దంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వెల్లడించారు.

హైవే ఆంధ్రాలో ఉన్నప్పటికీ తమిళనాడు పరిధిలో ఉందన్న ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి
దీనిపై కృష్ణబాబు స్పందిస్తూ, ఈ హైవే ఆంధ్రాలో ఉన్నప్పటికీ తమిళనాడు హైవే అధికారుల పరిదిలో ఉన్నందున తమ దృష్టికి రాలేదని హైవే ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని ఆయన ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే విన్నపం మేరకు ఆమె సమక్షంలోనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, చీఫ్ సెక్రెటరీ, మరియూ హైవే ఉన్నతాధికారి R.O గార్లతో విడివిడిగా ఫోన్లో మాట్లాడి ఇక్కడి దుస్థితిని ఆయన వారికి వివరించారు. అవసరమైతే ఆప్రాంతాన్ని తమ పరిథిలోకి అప్పగించాలని కూడా కోరారు.
Recommended Video

తమిళనాడు అధికారులతో మాట్లాడిన ఏపీ అధికారులు .. సానుకూల స్పందన
దీనిపై తమిళనాడు అధికారులు సానుకూలంగా స్పందించడమే గాక ఎమ్మెల్యే రోజా కోరిన విధంగా వెంటనే రోడ్డు మరమ్మత్తులను చేపడతామని, పనులను కూడా పరిశీలించి అవకతవకలుంటే వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొంటామని తెలిపారు. రోడ్డు బాగుచేయడమే కాకుండా, రెగ్యులర్ మెయింటెనెన్స్ పై కూడా శ్రద్దవహిస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయమైనా, ఎలాంటి సందర్భంలో అయినా దూకుడుగా వ్యవహరించే రోజా నగరి నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. నగరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే రోజా సెల్వమణి కీలకంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications