దానిపై ఎవరైనా కన్నేస్తే పోరాటమే: నటుడు శివాజీ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సీమాంధ్ర రాజధానిగా అంగీకరించవద్దని సినీ హీరో శివాజీ విద్యార్థులతో అన్నారు. వర్శిటీలోని డైక్మెన్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి శివాజీ విశిష్ఠ అతిధిగా హాజరయ్యారు. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు యలమంచిలి శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధునిక దేవాలయం వంటిదని, వ్యాపార ధోరణి, రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా విశ్వవిద్యాలయ అభివృద్దికి కృషి చేయాలన్నారు. నాగార్జున వర్శిటీపై ఎవరైనా కన్నేస్తే విద్యార్థులు పోరాటం చేయాలన్నారు. ఆ పోరాటంలో తన వంతు సహకారం అందిస్తానన్నారు. దేశాన్ని పురోగాభివృద్దిలో నడిపించాలంటే ఓటు ద్వారా సమర్ధవంతమైన పరిపాలనాధ్యక్షులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.

విద్యార్థులు ఓటు హక్కుతో భవిష్యత్ రాజకీయాలు, దేశాభివృద్దిని తమ చేతిలోకి తీసుకోవాలన్నారు. అవినీతిపరులు, సామాజిక స్పృహ లేనివారిని వ్యతిరేకించాలని తెలిపారు. సాంకేతిక విద్యలో ఇప్పటికీ 50 శాతం మంది విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరీక్షించడం విచారకరమన్నారు. ఆయా ప్రభుత్వాలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణమన్నారు. ఉపాధ్యాయుల కొరతను అంతమొందించి నాణ్యత కలిగిన విద్యా విధానం ద్వారా నవ సమాజ నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
వర్శిటీలు ఈ మేరకు ప్రభుత్వాలకు మార్గదర్శకంగా వ్యవహరించాలన్నారు. సినిమాలలో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని చెప్పారు. రానున్న రోజుల్లో భూగర్బ జలాల ద్వారా ప్రబలుతున్న రోగాలను రూపుమాపుటకు కృషి చేస్తామన్నారు.
ప్రతి గ్రామానికి సురక్షితమైన మంచినీరు అందేలా పోరాటం చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం ప్రజలకు అందేలా చేయాలనే సంకల్పంతో ఉన్నానని శివాజీ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఒక వెబ్సైట్ ద్వారా తన కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని శివాజీ చెప్పారు.












Click it and Unblock the Notifications