చంద్రబాబు, జగన్ ప్రధానులైనా హోదా రాదు- పుదుచ్చేరి వేరు- సుజనా కామెంట్స్
ఏపీకి కేంద్రమంత్రిగా ఉండగా ప్రత్యేక హోదాను గతంలో పందుల పోటీలతో పోల్చి విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోమారు ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన మరోసారి తేల్చేశారు. చంద్రబాబు ప్రధానిగా ఉన్నా అది సాధ్యం కాదన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఎదురవుతున్న విమర్శలకు కౌంటర్గా సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదాపై సుజనా నోటి దురద
ఏపీకి విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై గతంలో వైసీపీ నేతలు జల్లి కట్టుపై తమిళనాడు నేతల తరహాలో ఆందోళనలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి వైసీపీ డిమాండ్పై స్పందిస్తూ పందుల పోటీలు పెట్టుకున్నా హోదా రాదని తేల్చేశారు. అప్పట్లో సుజనా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి హోదీతో పాటు విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన తప్పుకోక తప్పలేదు. ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదాపై సుజనా చౌదరి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, జగన్ ప్రధాని అయినా హోదా రాదు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పుదుచ్చేరికి కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇస్తామని బీజేపీ ప్రకటించడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సుజనా చౌదరి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబు, జగన్ ప్రధానిగా ఉన్నా ప్రత్యేక హోదా ఇవ్వలేరని సుజనా తేల్చిచెప్పారు. దీనిపై టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదాను టీడీపీ, వైసీపీ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆర్ధికసంఘం ఎప్పుడో చెప్పిందని సుజనా గుర్తుచేశారు.

పుదుచ్చేరికి ఇచ్చిన హోదా వేరు
పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంత హోదా హామీకి ఏపీ ప్రత్యేక హోదా హామీకీ సంబంధం లేదని సుజనా స్పష్టం చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలని సుజనా తెలిపారు. ఏపీకి ఇవ్వకుండా పుదుచ్చేరికి హోదా ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుజనా ఈ క్లారిటీ ఇచ్చారు. పుదుచ్చేరికి ఇచ్చిన హామీపై సరిగ్గా చదువుకోవాలని ఆయన విమర్శకులకు సూచించారు. పుదుచ్చేరిలో కేంద్ర పథకాల విషయంలో అదనపు సాయం చేస్తామని మాత్రమే దీని అర్ధమని సుజనా వివరించారు.












Click it and Unblock the Notifications