కనికరించని ప్రభుత్వాలు... ఆపై క్వారంటైన్ భయాలు...చంద్రబాబు హైదరాబాద్ కదలకపోవడం వెనుక ?
ఓవైపు కరోనా సంక్షోభం... మరోవైపు విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదం... వేలాది మందిపై ప్రభావం చూపే రెండు ప్రధాన సమస్యలివి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన విపక్ష టీడీపీ అధినేత ఎక్కడున్నారు ? కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు ఎందుకు వెనక్కి తిరిగి రావడం లేదు ? ప్రభుత్వాలు ఆయన్ను నిలువరిస్తున్నాయా ? లేక రాష్ట్రం దాటితే క్వారంటైన్ కు వెళ్లాల్సి వస్తుందన్న భయాలతోనే ఆయన అమరావతి రాలేకపోతున్నారా ? ఇప్పుడు ఏపీలో సగటు జనాన్ని వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్నలివి...
విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు- స్పందన కరవు ?
Recommended Video
సంక్షోభంలోనూ హైదరాబాద్ వీడని చంద్రబాబు...
అప్పుడెప్పుడో మార్చినెలలో కరోనా వైరస్ లాక్ డౌన్ విధించకముందు అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై ఉన్న ఇంటని వీడి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సొంత రాష్ట్రం ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కీలకమైన ఇలాంటి తరుణంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేత, మూడుసార్లు సీఎంగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏం చేయాలి ? కష్టాల్లో ఉన్న జనానికి ఓవైపు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రభుత్వం సక్రమంగా పనిచేయపోతే ప్రశ్నించే పరిస్ధితుల్లో ఉండాలి. కానీ చంద్రబాబు ఆ దిశగా అడుగులేస్తున్నారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది.
విశాఖ వెళ్తానని కేంద్రాన్ని కోరిన బాబు...
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన చాలా తీవ్రమైనది. ఇప్పటికే ఇందులో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు సీఎం జగన్ ఘటనా స్ధలికి, ఆస్పత్రులకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇవాళ విపక్ష బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా బాధితులను పరామర్శించబోతున్నారు. రేపోమాపో జనసేనాని పవన్ కూడా విశాఖ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం విశాఖ వెళ్లే్ందుకు ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ సంప్రదించలేదు. అదే సమయంలో విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరడం విశేషం. అయినా కేంద్రం కూడా కనికరించలేదని తెలుస్తోంది.
కేంద్రం అనుమతివ్వకపోవడం వెనుక...
విశాఖలో గ్యాస్ లీక్ ఘటన గురించి సమాచారం తెలియగానే చంద్రబాబు తనకు అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం అనుమతిస్తే వెంటనే బయలుదేరి వెళ్లేందుకు సైతం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముంబై నుంచి రావాల్సిన ప్రత్యేక విమానాన్ని కేంద్రం అనుమతించలేదని తెలుస్తోంది. దీంతో మధ్యాహ్నం వరకూ ఎదురుచూసిన బాబు... ఆ తర్వాత ఇక ఆశలు వదులుకుని హైదరాబాద్ లోని ఇంటినుంచే విశాఖలో పరిస్ధితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కేంద్రం చంద్రబాబుకు ఎందుకు అనుమతివ్వలేదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత ఇతర రాష్ట్రంలో ఉంటూ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏకంగా కేంద్రాన్ని అనుమతి కోరడంతో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా నివారించేందుకు అనుమతి ఇవ్వలేదని అర్ధమవుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కాదని కేంద్రం ఒకవేళ చంద్రబాబుకు అనుమతి ఇచ్చి ఉంటే జాతీయ స్దాయిలో ఇదో హాట్ టాపిక్ గా మారేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
అమరావతి రాకపోవడం వెనుక ?
వాస్తవానికి టీడీపీ అధినేత, ప్రధాన విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. కాకుంటే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అధికారులు 14 రోజుల క్వారంటైన్ కు పంపుతున్నారు. కానీ వీఐపీలకు ఇందులో మినహాయింపులు ఉంటాయి. కానీ ముందుగా ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అటు తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ తో కానీ, ఇటు ఏపీ సీఎం జగన్ తో కానీ చంద్రబాబు ముఖాముఖీ తలపడుతున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సందర్బంగా వీరిద్దరితో ముఖాముఖీ తలపడి ఓటమిపాలైన చంద్రబాబు.. అప్పటి నుంచీ కేసీఆర్, జగన్ పేరెత్తితేనే మండిపడుతున్నారు. దీంతో అమరావతి వెళ్లేందుకు వీరిద్దరి అనుమతి కోరాల్సి రావడం ఇప్పుడు బాబుకు అతిపెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వాధినేతలుగా వీరిని అధికారికంగా సంప్రదించడంలో తప్పేమీ లేదు. అలా కోరినప్పుడు వారు అనుమతించకపోతే ప్రజల దృష్టిలో వారే చులకన అవుతారు. కానీ క్వారంటైన్ భయాలతోనో, సీఎంలను తాను అనుమతి కోరడమేంటనే ఇగోతోనే దూరంగా ఉండిపోతే ప్రజల దృష్టిలో చంద్రబాబు విమర్శల పాలవుతారు.